Selfie సరదా, రామడుగు ప్రాజెక్టులో పడి చనిపోయిన యువకుడు

Nizamabad Ramadugu Project : Selfie సరదా మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం రామడుగు (Ramadugu Project) ప్రాజెక్టు వద్ద నవీన్ అనే యువకుడు సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు పడిపోయాడు. సెల్ఫీ మోజులో పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. నవీన్ కువైట్ నుంచి ఇటీవలే వచ్చాడు. హోం క్వారంటైన్ అనంతరం స్నేహితులను కలిశాడు.
సరదాగా రామడుగు ప్రాజెక్టు వద్దకు వెళుదామని చెప్పడంతో నవీన్ అక్కడకు వెళ్లాడు. అక్కడి అందాలను ఫోన్ లో బంధించాలని అనుకున్నారు. నవీన్ ప్రాజెక్టు వద్ద నిలబడి సెల్ఫీ తీసుకొనే ప్రయత్నం చేశాడు. కానీ ప్రమాదవశాత్తు..పడిపోయి..వరద ప్రవాహంలో కొట్టుకపోయాడు.
సమాచారం తెలుసుకున్న రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకుంది. గజ ఈతగాళ్ల సహాయంతో గాలించి నవీన్ డెడ్ బాడీని బయటకు తీశారు. అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ప్రాజెక్టు వద్ద ఎలాంటి జాగ్రత్తలు ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
భారీ వర్షాలతో రామడుగు ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. నిండు కుండలా మారింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి మట్టం 1278 అడుగులు. ఎగువన ఉన్న వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి.
ప్రాజెక్టు ఆయకట్టు కింద సుద్దులం, రామడుగు, కేశారం, యానంపల్లి, కోరట్పల్లి, మైలారం, చింతలూర్, చెంగల్ తదితర గ్రామాల రైతులకు లబ్ది చేకూరనుంది.