తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్.. ఏఐసీసీ అధికారిక ప్రకటన

ఆయనను పీసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే నియమించినట్లు ఏఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.

తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్.. ఏఐసీసీ అధికారిక ప్రకటన

Mahesh Kumar Goud

Mahesh Kumar Goud: తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడుగా మహేశ్ కుమార్ గౌడ్‌ను నియమిస్తున్నట్లు ఏఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇన్నాళ్లు టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతల్లో ఉన్న రేవంత్ రెడ్డి అందించిన సహకారాన్ని అభినందిస్తున్నట్లు ఏఐసీసీ పేర్కొంది.

తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడి నియామకం అంశం చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి మూడేళ్ల కాల పరిమితి ముగిసింది. ప్రస్తుతం ఆయన సీఎంగా ఉండటంతో టీపీసీసీ పగ్గాలను ఇతర సామాజిక వర్గాలకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పార్టీ సీనియర్ నేతలను పలుసార్లు ఢిల్లీకి పిలిపించి అభిప్రాయాలను తీసుకుంది.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి విషయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలలో ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలనే దానిపై కాంగ్రెస్ సుదీర్ఘ మంతనాలు చేసింది. చివరకు పీసీసీ పీఠాన్ని బీసీ వర్గానికి ఇవ్వాలని నిర్ణయించింది. ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్‌ పీసీసీ చీఫ్‌ పదవికి పోటీ పడ్డారు. చివరకు మహేశ్ కుమార్ గౌడ్ నే ఆ పదవి వరించింది.

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి పదవీకాలం ముగియడంతో… కొత్త అధ్యక్షునిపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు సుదీర్ఘ కాలంపాటు కసరత్తు చేసింది. సీనియారిటీ, విధేయ‌త‌, సామాజిక సమీకరణాలు, ప్రాంతం ఇలా ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుని కొత్త బాస్ ను ఎంపిక చేసింది. పీసీసీ చీఫ్‌ ఎంపిక వేళ గతంలో ఆశావహులు, సీనియర్ నేతలు హస్తినలో మకాం వేసి మరీ చర్చలు జరిపారు.

మహేశ్ కుమార్ గౌడ్ రాజకీయ ప్రయాణం

  • ఉమ్మడి ఏపీలో 2013, 14లో వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేసిన మహేశ్ కుమార్ గౌడ్
  • యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్‌యూఐలో పని చేసిన మహేశ్
  • 2014లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓటమి
  • కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఉన్న మహేశ్ కుమార్ గౌడ్
  • ప్రస్తుతం టీపీీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్‌గా ఉన్న మహేశ్ కుమార్ గౌడ్
  • ఎమ్మెల్సీగానూ ఉన్న మహేశ్ కుమార్ గౌడ్