Ration Shops : రేషన్ కార్డుదారులకు ముఖ్య గమనిక.. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ బంద్
తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ముఖ్య గమనిక. నేడు రాష్ట్రవ్యాప్తంగా రేషన్ బియ్యం పంపిణీ ఉండదని పౌరసరఫరాల శాఖ ప్రకటించింది.

Ration Shops
Ration Shops : తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ముఖ్య గమనిక. నేడు రాష్ట్రవ్యాప్తంగా రేషన్ బియ్యం పంపిణీ ఉండదని పౌరసరఫరాల శాఖ ప్రకటించింది. డాటా సెంటర్లలో సర్వర్లను ఆధునికీకరిస్తున్నారు. దీంతో రేషన్ షాపుల్లో బియ్యం పంపిణీ నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఆదివారం నుంచి యథావిధిగా బియ్యం ఇస్తామని తెలిపారు. మరోవైపు ప్రతి నెల 1వ తేదీ నంచి బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటికే 10 రోజులు ఆలస్యమైంది.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ భవనంలోని రాష్ట్ర డేటా కేంద్రం (ఎడీసీ)లో కొత్త యూపీఎస్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆన్ లైన్ సేవలు నిలిచిపోయిన విషయం విదితమే. అదే సమయంలో సర్వర్లు పని చెయ్యక రేషన్ కార్డుదారులకు చౌకధర దుకాణాల ద్వారా నిత్యవసరాల పంపిణీని కూడా శుక్రవారం ఉదయం నుండి శనివారం వరకు నిలిపివేశారు.
యథావిధిగా ఆదివారం నుండి రేషన్ పంపిణీ ప్రక్రియ తిరిగి ప్రారంభిస్తారు. సాంకేతిక కారణాలతో అంతరాయం ఏర్పడిందని, రేషన్ లబ్దిదారులు ప్రభుత్వానికి సహకరించాలని పౌరసరఫరాల శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ నెలలో రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా ఆలస్యం అయ్యింది. దానికి సర్వర్ సమస్యలు కూడా తోడయ్యాయి. సమయానికి రేషన్ అందక లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం కొత్తగా 4.05 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారని, అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇప్పటికే 3 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని, మిగిలిన వాటిని నాలుగైదు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు.
మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకున్న వాటన్నింటిపై విచారణ జరిపించి అర్హులకు రేషన్ కార్డులు అందజేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో 2.91 లక్షల మంది అర్హులున్నారని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే కేంద్రం మాత్రం 1.81 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించిందన్నారు. రాష్ట్రంలో మొత్తం 81 లక్షల కార్డులు ఇచ్చి 2.81 కోట్ల మంది లబ్ధిదారులకు రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. సీఎం ఆమోదించిన వెంటనే రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.