YS Sharmila: నాలుగేళ్లు గడీల్లో కుంభకర్ణుడిలా మొద్దు నిద్రపోయారు.. ఇప్పుడు జనాలకు మద్యం తాగిస్తారట: షర్మిల

అందుకే రుణమాఫీకి డబ్బుల్లేక నవంబర్ లో చేయాల్సిన మద్యం టెండర్లను మూడు నెలల ముందే ముంగటేసుకున్నారని అన్నారు.

YS Sharmila: నాలుగేళ్లు గడీల్లో కుంభకర్ణుడిలా మొద్దు నిద్రపోయారు.. ఇప్పుడు జనాలకు మద్యం తాగిస్తారట: షర్మిల

YS Sharmila

Updated On : August 3, 2023 / 5:20 PM IST

YS Sharmila – KCR: దొర గారికి ఎన్నికల ముందే హామీలు యాదికొస్తాయంటూ తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్టీపీ (YSRTP) అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. నాలుగేళ్ల పాటు గడీల్లో కుంభకర్ణుడిలా మొద్దు నిద్రపోయిన సీఎం ఇప్పుడు మళ్లీ ఓట్ల కోసం అటక మీద దాచిన మేనిఫెస్టో తిరగేస్తున్నారని చెప్పారు.

ఇప్పుడు మళ్లీ రైతులను ఓట్లు అడిగే ముఖం లేక రుణమాఫీ చేస్తానని నక్క వినయం ప్రదర్శిస్తున్నా.. అమలు చేయడానికి కేసీఆర్ దగ్గర చిల్లిగవ్వ లేని పరిస్థితి అని షర్మిల అన్నారు. బీఆర్ఎస్ బందిపోట్లకు నాలుగున్నరేళ్లుగా తెలంగాణ సొమ్మంతా దోచుకోవడం, దాచుకోవడానికే సరిపోయిందని చెప్పారు.

ఇక మేనిఫెస్టోలో హామీలు నెరవేర్చడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని షర్మిల నిలదీశారు. అందుకే రుణమాఫీకి డబ్బుల్లేక నవంబర్ లో చేయాల్సిన మద్యం టెండర్లను మూడు నెలల ముందే ముంగటేసుకున్నారని అన్నారు.

” జనాలకు మద్యం తాగిస్తాడట… వచ్చిన సొమ్ముతో రుణమాఫీ చేస్తాడట. సిగ్గుందా ముఖ్యమంత్రి గారు? రేట్లు పెంచి, టాక్స్ పెంచి ప్రజల రక్తం తాగడం చాలదని.. మద్యం తాగించి, మహిళల మంగళసూత్రాలు తెంపి, జనాలను మద్యానికి బానిస చేసి ఓట్లు దండుకోవడమా? కరోనా సమయంలోనూ రాష్ట్రం ఆర్థికంగా దూసుకెళ్లిందని, నిధుల కొరత లేదని ఇన్నాళ్లూ గప్పాలు కొట్టిన దొర.. ఇప్పుడు రుణమాఫీ చేయడానికి కరోనా అడ్డుతగిలిందట!

ఇది చాలదన్నట్లు ఔటర్ రింగ్ రోడ్డును అగ్గువల 7 వేల కోట్లకే లీజుకిచ్చుకున్నరు… ప్రభుత్వ భూములను యథేచ్చగా అమ్ముకుంటున్నరు.. పకడ్బందీగా ఎన్నికల కోసం డబ్బును పోగు చేసుకుంటున్నరు.. మొత్తానికి కేసీఆర్ ఏం చేసినా ఎన్నికల కోసమే చేస్తడు అనే మాట నిలబెట్టుకుంటున్నడు.. నీ పిట్టల దొర ముచ్చట్లను నీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా నమ్మరు.

ఓట్ల కోసమైనా ఇచ్చిన హామీలు గుర్తు చేసుకుంటున్న దొర గారు.. అదే చేతితో డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వండి, నిరుద్యోగ భృతి ఇవ్వండి, వరద బాధితులను ఆదుకోండి, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వండి, చట్ట సభల్లో బీసీలకు 33%, మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయండి.

ఆగిపోయిన దళిత బంధును, మైనారిటీ బంధును అమలు చేయండి.. బీసీల్లోని అన్ని కులాలకు బీసీ బంధు ఇవ్వండి. ఎన్నికలకు ముందే రెండు దఫాల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి, మీరు పిట్టల దొర కాదని నిరూపించుకోండి ” అని షర్మిల డిమాండ్ చేశారు.

Kharge vs Dhankar: నాకు పెళ్లైంది, కోపం రాదు.. రాజ్యసభలో చైర్మన్ ధన్‭కడ్, విపక్ష నేత ఖర్గే మధ్య జోకులు