రెండో భార్యకు విడాకులు….ఆమె మళ్లీ పెళ్ళి చేసుకుందని…

గ్రామ సర్పంచ్ ఎన్నికల కోసం మున్సిపాల్టీ ఉద్యోగి అయిన రెండో భార్యకు విడాకులిచ్చాడు ఒక ప్రబుధ్ధుడు.. ఆమె మరోక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ పెళ్ళి ఫోటోలు చూసి, ఆమె భర్తను హత్య చేయబోయాడు. భూమ్మీద నూకలు ఉండి ఆమె భర్త బతికిపోయాడు.
వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపల్లి గూడెం కు చెందిన ఇనుగాల విజయకుమార్ రెండో భార్య జ్యోత్స్న మున్సిపాల్టీలో ఉద్యోగం చేస్తోంది. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశ్యంతో విజయకుమార్ జ్యోత్స్నకు విడాకులు ఇచ్చాడు.
ఆ తర్వాత జ్యోత్స్న అదే గ్రామానికి చెందిన ఇనుగాల తిరుపతి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వాళ్ళిద్దరి పెళ్లి ఫొటోలు వాట్సాప్లో వైరల్ అయ్యాయి. అవి చూసిన మొదటి భర్త విజయకుమార్, జ్యోత్స్నను…. తిరుపతి అపహరించుకెళ్లాడని హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో తిరుపతి అరెస్ట్ అయి బెయిల్పై బయటకు వచ్చాడు.
https://10tv.in/matrimonial-fraud-woman-marries-8-senior-citizens-in-10-years-flees-with-cash-and-jewellery/
కాగా….. ఏడాది క్రితం తిరుపతి తమ్ముడు మధు అవసరం నిమిత్తం విజయ్ కుమార్ వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. తన రెండో భార్యను తిరుపతి పెళ్లి చేసుకోవటం జీర్ణించుకోలేని విజయ్కుమార్, తన వద్ద అప్పుగా తీసుకున్న డబ్బు ఇవ్వాలని మధుని వత్తడి చేశాడు.
ఒకదశలో బూతులు తిడుతూ చెప్పుతో కొట్టాడు. ఈ ఘటనపై మధు విజయకుమార్ పై కమలాపూర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కోపంతో తిరుపతిని ఎలాగైనా చంపాలని విజయ్ కక్ష పెంచుకున్నాడు.
కాగా …ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన తిరుపతి ముడు రోజుల క్రితం సొంతూరుకు తిరిగి వచ్చాడు. తిరుపతిని చంపటానికి ఇదే సరైన సమయం అని భావించాడు విజయకుమార్. గురువారం రాత్రి గ్రామంలోని జెండా గద్దె వద్ద తిరుపతి కూర్చుని ఉండగా, తన అనుచరులైన ఇనుగాల కుమార్, ఇనుగాల మొగిలి, ఇనుగాల సాంబయ్య, ఇనుగాల రాజు, ఇనుగాల రవి లతో కలిసి కర్రలతో అతడిపై దాడి చేస్తూ గ్రామ శివారులోని పెద్దిరెడ్డి చెరువు కట్ట వైపు తీసుకెళ్లారు.
అక్కడ డొక్కలో, ఛాతి, భుజంపై పదునైన కత్తులతో పొడవడంతో ఎడమ చేయి మణికట్టు నుంచి తెగిపడటంతో పాటు తీవ్రగాయాలు అయ్యాయి. తిరుపతి చనిపోయాడని భావించిన ఐదుగురు అక్కడి నుంచి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న తిరుపతి తమ్ముడు మధు రక్తపు మడుగులో పడి ఉన్న తన అన్నను 108 వాహనంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించాడు.
సమచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి పరిశీలించారు. మధు ఫిర్యాదు మేరకు దాడి చేసిన అనుమానిులపై కేసు నమోదు చేసుకున్నారు. విజయకుమార్,జ్యోత్స్న, మొగిలి, రాజు, లను అరెస్ట్ చేసి కోర్టు లో హాజరు పరిచారు. నిందితుల వద్ద నుంచి కారు, ద్విచక్ర వాహానం, నాలుగు సెల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నట్లు కాజీపేట ఎసీపీ రవీంద్రకుమార్ చెప్పారు.