ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై కమిటీ
ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై కమిటీ ఏర్పాటు చేశారు. రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్ గా ఆరుగురు సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది.
ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై కమిటీ ఏర్పాటు చేశారు. రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్ గా ఆరుగురు సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది.
ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై కమిటీ ఏర్పాటు చేశారు. రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్ గా ఆరుగురు సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది. మొత్తం 9 అంశాలపై కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనుంది. విలీనం తర్వాత ఆర్టీసీ బిజినెస్ రూల్స్ లో మార్పులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదికను ఇవ్వనుంది. ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటుపై సూచనలు చేయనుంది.
ఏపీఎస్ఆర్టీసీలో శాశ్వత, తాత్కాలిక ఉద్యోగుల జీతభత్యాలు, ఆర్థిక, న్యాయపరమైన అంశాలపై నివేదిక ఇవ్వనుంది. విలీన ప్రక్రియలో మిగిలిన అంశాలపై అధ్యయనం చేసి కమిటీ నివేదిక ఇవ్వనుంది. (నవంబర్, 2019) చివరి కల్లా నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కమిటీని ఆదేశించింది. ఇప్పటికే ఆర్టీసీ విలీనం, ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. జగన్ అధ్యక్షతన నిర్వహించిన తొలి కేబినెట్ సమావేశంలోనే ఆర్టీసీ విలీనానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అందులో భాగంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై కమిటీని ఏర్పాటు చేశారు. ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
రోడ్డు రవాణా చట్టం-1950ని అనుసరించి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రజారవాణా వ్యవస్థలో భాగంగా ఆర్టీసీలు ఏర్పడ్డాయి. 1958 జనవరి 11న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్ఆర్టీసీ ఆవిర్భవించింది. రాష్ట్ర విభజనం అనంతరం ఏపీఎస్ఆర్టీసీ నుంచి తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విడిపోయింది. అప్పటి నుంచి విజయవాడ కేంద్రంగా ఏపీఎస్ఆర్టీసీ కార్యకలాపాలు సాగుతున్నాయి.
ప్రభుత్వ రంగ సంస్థగా ఏర్పడిన ఆర్టీసీలో ప్రారంభం నుంచి చాలా మార్పులు జరిగాయి. కొన్నేళ్లుగా అద్దె బస్సులు, తాత్కా4లిక సిబ్బంది నియామకాలు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీకి 11వేల 678 బస్సులున్నాయి. అందులో 8వేల 964 బస్సులు ఆర్టీసీకి చెందినవి కాగా, మరో 2వేల714 బస్సులు అద్దె ప్రాతిపదికన నడిపిస్తున్నవి. రాష్ట్ర వ్యాప్తంగా 126 బస్సు డిపోలు, 426 బస్సు స్టేషన్ల ఉన్నాయి.
ప్రస్తుతం నాలుగు జోన్లు, 12 రీజియన్లుగా ఏపీఎస్ఆర్టీసీ నడుస్తోంది. ఇటీవల సంస్థ ఏసీ బస్సుల నిర్వహణ మీద దృష్టి పెట్టింది. వెన్నెల, అమరావతి, గరుడ, ఇంద్ర వంటి సర్వీసులను తీసుకువచ్చింది. మొత్తంగా 299 ఏసీ సర్వీసులు నడుస్తున్నాయి. వీటిలో అత్యధికంగా 119 ఇంద్ర, 68 గరుడ సర్వీసులు ఉన్నాయి. సూపర్ లగ్జరీ, డీలక్స్, మెట్రో డీలక్స్తో పాటుగా పల్లె వెలుగు సర్వీసుల ద్వారా అనేక గ్రామీణ ప్రాంతాలు, సిటీ బస్సులతో నగర ప్రాంతాలను కవర్ చేస్తూ సంస్థకు నెట్వర్క్ ఉంది. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల్లోనూ ఏపీఎస్ఆర్టీసీ సర్వీసులు నడుస్తున్నాయి.