బ్రాహ్మణి పిలుపు : లోకేష్ను గెలిపించాలి, చంద్రబాబునే సీఎం చెయ్యాలి

గుంటూరు : దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.24వేల కోట్ల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం టీడీపీ అని నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి అన్నారు. తన భర్త నారా లోకేష్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో బ్రాహ్మణి ఎన్నికల ప్రచారం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు రూ.15వేలు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే లోకేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మరోసారి చంద్రబాబు ఏపీకి సీఎం కావాల్సిన అవసరం ఉందన్నారు.
టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ ను గెలిపిస్తే మంగళగిరిని మరింత డెవలప్ చేస్తారని బ్రాహ్మణి అన్నారు. లోకేష్ తరుఫున బ్రాహ్మణి తొలిసారి ఎన్నికల ప్రచారం చేశారు. లోకేష్ ను గెలిపిస్తే ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తన భర్త ఎమ్మెల్యే కాకపోయినా ఐటీ మంత్రి హోదాలో మంగళగిరికి 42 కంపెనీలు తీసుకొచ్చారని, 3 వేల 500 మందికి ఉద్యోగాలు ఇచ్చారని బ్రాహ్మణి తెలిపారు. అభివృద్ధి పనులు కొనసాగాలంటే ఎమ్మెల్యే అభ్యర్థి లోకేష్, ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని బ్రాహ్మణి కోరారు.
రాజధాని ప్రాంతంలో ఉన్న మంగళగిరికి ఐదేళ్లలో మరిన్ని సంస్థలు తీసుకొచ్చి 15వేల ఉద్యోగాలు ఇచ్చేందుకు లోకేష్ కృషిచేస్తారని బ్రాహ్మణి చెప్పారు. ఇప్పటికే మంగళగిరిలో రూ.40 వేల కోట్ల విలువైన పనులు జరిపిస్తున్నారని ఆమె వెల్లడించారు. లోకేష్ ఎమ్మెల్యే అయితే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని, మంగళగిరిని మరో స్థాయికి తీసుకెళతారని హామీ ఇచ్చారు. మంగళగిరిలో ఎత్తిపోతల పథకాలు ఆశించిన స్థాయిలో లేవని, 50శాతం మాత్రమే లిఫ్ట్ ఇరిగేషన్ ఉందని, లోకేష్ ఎమ్మెల్యే అయితే ఆగస్టు కల్లా 100శాతం నీటిపారుదల తీసుకొస్తారని బ్రాహ్మణి తెలిపారు.
తొలిసారి పార్టీ మేనిఫెస్టో కాకుండా లోకేష్ సొంతంగా మంగళగిరి మేనిఫెస్టో రూపొందించారని ఆమె తెలిపారు. మంగళగిరిలో ఉన్న అన్ని సమస్యలను ఆ మేనిఫెస్టోలో పొందుపరిచారని చెప్పారు. తమ ఇల్లు, ఓట్లూ మంగళగిరిలోనే ఉన్నాయని వెల్లడించారు. కుప్పం నుంచి తమ వాళ్లు వస్తే ఎలా ఆహ్వానిస్తామో, మంగళగిరి ప్రజలు వచ్చినా అలాగే ఆహ్వానిస్తామన్నారు. లోకేష్ ఇక్కడే కార్యాలయం ఏర్పాటు చేసుకుని నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరిస్తారని, ఆ తర్వాతే ఇతర వ్యవహారాలు చూసుకుంటారని బ్రాహ్మణి చెప్పారు.