మహిళా, శిశు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి

  • Published By: veegamteam ,Published On : September 9, 2019 / 01:48 PM IST
మహిళా, శిశు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి

Updated On : September 9, 2019 / 1:48 PM IST

మహిళా, శిశు సంక్షేమం ప్రత్యేక దృష్టి సారించినట్లు ఏపీ సీఎం జగన్‌ తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం (సెప్టెంబర్ 9, 2019) మహిళా శిశు సంక్షేమ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమల్లో అధికారులకు సీఎం మార్గనిర్ధేశం చేశారు. సంక్షేమ పథకాల అమల్లో అనుసరిస్తున్న విధానాలు పథకాలను నిరాకరించేలా ఉండకూడదని స్పష్టం చేశారు. పథకాలు సంతృప్తికర స్థాయిలో లబ్ధిదారులకు అందించడానికే ఈ విధానాలు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. బయోమెట్రిక్‌, ఐరిస్‌, వీడియో స్క్రీనింగ్‌ వంటివన్నీ ఆ పథకం లబ్ధిదారుడికి చేరేందుకు ఉపయోగపడాలే కానీ.. వాటి కారణంగా నిరాకరించకూడదని సీఎం అన్నారు.

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయంలో అవసరాల కొరకు హెల్ప్‌లైన్‌  ఏర్పాటు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. గ్రామాల నుంచి వస్తున్న అత్యవసర విషయాలపై ప్రభుత్వం, యంత్రాంగం స్పందించడానికి ప్రత్యేక మెకానిజం ఉండాలని సూచించారు. దీని కోసం ప్రతి గ్రామ సచివాలయంలో ఒక హెల్ప్‌లైన్‌ ఉండాలన్నారు. గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసుల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు.

1008 కేసుల్లో వేధింపులకు గురైన మహిళలకు ఇవ్వాల్సిన పరిహారం రూ.7.48 కోట్లను గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకురావడంతో.. వెంటనే ఆ నిధులను విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. వివిధ ఘటనల్లో బాధితులకు సహాయం చేయడానికి జిల్లా కలెక్టర్‌కు కోటి రూపాయల చొప్పున నిధిని కేటాయించాలని సీఎం నిర్ణయించారు. నిధి ఖర్చు అవుతున్న కొద్దీ… కోటి రూపాయలకు తగ్గకుండా నిల్వ ఉండేలా మళ్లీ మంజూరు చేయాలన్నారు.

మహిళల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సీఎం తీవ్రంగా స్పందించారు. వెంటనే నివారణ చర్యలను చేపట్టాలని ఆదేశించారు. టెస్ట్‌-ట్రీట్‌-టాక్‌ విధానంలో ఈ రక్తహీనతను అధిగమించే చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. రక్తహీనత ఉన్న మహిళలను గుర్తించేందుకు అవసరమైన పరీక్షలు నిర్వహించి తగిన చికిత్స అందించడంతో పాటు రక్తహీనత నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నట్లు సీఎంకి వివరించారు. 

పౌష్టికారంలో భాగంగా గర్భవతులకు ఏ విధమైన ఆహారంగా ఇస్తున్నారని సీఎం అడిగి తెలుసుకున్నారు. రోజుకు రూ.22.5లు ఖర్చుచేస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. మరింత నాణ్యమైన, పౌష్టికరమైన ఆహారాన్ని అందించడంపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. మహిళా, శిశు సంక్షేమంలో గ్రామవాలంటీర్లకు భాగస్వామ్యం కల్పించాలన్నారు. శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆదేశించారు. పిల్లలకు అందుతున్న భోజనం, వారి సంరక్షణపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలని, దీని కొరకు అంగన్‌వాడీ వర్కర్లను మోటివేట్‌ చేయాలన్నారు. అలాగే బాల్య విహహాల నియంత్రనపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో బాల్య వివాహాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలిని ఆదేశించారు. 

అంగన్‌ వాడీ సెంటర్ల స్థితిగతులపై పూర్తినివేదిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. స్కూళ్లలో చేపడుతున్న నాడు-నేడు తరహా కార్యక్రమాలను చేపట్టడానికి ప్రణాళిక తయారు చేయాలన్నారు. మూడేళ్లలో ఈ పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నారైలు, సంస్థలు, దాతల సహాయం తీసుకుందామని అధికారులకు సూచించారు. దీని కోసం ప్రత్యేక పోర్టల్‌ రూపకల్పనకు ఇదివరకే ఆదేశాలు ఇచ్చామని సీఎం గుర్తుచేశారు. ప్రభుత్వం పాఠశాలలకు ఎవరు సహాయం చేసినా వారి పేర్లు పెడతామని తెలిపారు.

ప్రభుత్వం చేపడుతున్న కార్యాక్రమాలపై కార్పొరేట్, వివిధ ప్రైవేట్ సంస్థలకు పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారులకు తెలిపారు. దివ్యాంగుల విషయంలో ఉదారంగా ఉండాలని, దివ్యాంగులకు ఎలాంటి పరికరాలు కావాలన్నా అందించాలని సీఎం జగన్‌ సూచించారు. ఆదేశించారు. అంగన్‌వాడీల నుంచి స్కూళ్లలో చేరని పిల్లలను వెంటనే గుర్తించి, వారిని వెంటనే ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించాలని అధికారులను ఆదేశించారు.