Navjot Sidhu : నిరాహార దీక్ష చేస్తా..చన్నీ ప్రభుత్వానికి సిద్ధూ హెచ్చరిక
పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సిద్ధూ ఆ రాష్ట్రంలోని సొంత ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. గురు గ్రంథ్ సాహిబ్ను అపవిత్రం చేయడం, మాదక ద్రవ్యాల మాఫియాపై నివేదికలను తక్షణమే
Navjot Sidhu : పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సిద్ధూ ఆ రాష్ట్రంలోని సొంత ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. గురు గ్రంథ్ సాహిబ్ను అపవిత్రం చేయడం, మాదక ద్రవ్యాల మాఫియాపై నివేదికలను తక్షణమే చరణ్ జీత్ సింగ్ చన్నీ ప్రభుత్వం బహిర్గతం చేయకపోతే, తాను నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు.
మోగాలోని బాఘ పురానాలో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి గురువారం ప్రసంగించిన సిద్ధూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. డ్రగ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని రెండు నెలల క్రితం సీఎం చన్నీ చెప్పారని ఈ సందర్భంగా సిద్ధూ గుర్తు చేశారు.
కాగా, సొంత పార్టీ, పంజాబ్లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై సిద్ధూ విమర్శలు చేయడం కొత్త కాదు. అమరీందర్ సింగ్ సీఎంగా ఉన్నప్పుడు కూడా పలు ఆరోపణలు చేశారు. సిద్ధూను పీసీసీ చీఫ్గా చేయడంతో ఆగ్రహించిన అమరీందర్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేయడంతోపాటు కాంగ్రెస్ పార్టీని వీడారు. అనంతరం చరణ్జిత్ సింగ్ చన్నీ సీఎం కాగా, ఆయనపైనా సిద్ధూ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు సమాచారం ఇవ్వకుండా కీలక నిర్ణయాలు తీసుకోవడంపై ఆగ్రహిస్తూ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు.
అయితే సీఎం చన్నీతోపాటు పార్టీ హైకమాండ్ బుజ్జగింపులతో తన రాజీనామాను వెనక్కి తీసుకున్నట్లు సిద్ధూ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక,వచ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే.
ALSO READ TMC : కాంగ్రెస్లో కుమ్ములాటలు.. మమతా బెనర్జీ టీఎంసీకి మంచి రోజులు.. దీదీ ఫుల్ ఖుషీ