అందుకే సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నా..మోడీ క్లారిటీ
మార్చి8(అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు)నుంచి సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నానని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం చేసిన ప్రకటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మోడీ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని లక్షలాది మంది మంది నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఇక ప్రతిపక్ష నేతలు సైతం మోడీ ప్రకటనపై తమదైన శైలిలో విమర్శలు గుప్పించారు. పలు అనుమానాలు లేవనెత్తారు.
అయితే వీటన్నింటికీ నరేంద్ర మోదీ మంగళవారం(మార్చి-3,2020) క్లారిటీ ఇచ్చారు. తానెందుకు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లను వదిలేస్తానన్నది స్పష్టం చేస్తూ మోడీ ఓ ట్వీట్ చేశారు. ఓ మంచి కార్యక్రమం కోసం ఆదివారం ఒక్కరోజే తన సోషల్ మీడియా అకౌంట్లను వదిలేస్తున్నట్లు మోడీ ప్రకటించారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తన ట్విట్టర్ అకౌంట్ ను మహిళలకే అంకితమిస్తున్నట్లు మోడీ చెప్పారు.
వచ్చే ఆదివారం ..మహిళా దినోత్సవం. మనకు స్ఫూర్తిగా నిలిచిన మహిళల కోసం నా సోషల్ మీడియా అకౌంట్లను వారికి అప్పగిస్తున్నాను. అలా చేయడం వల్ల వాళ్లు లక్షలాది మందిని ఉత్సాహపరిచినట్లు అవుతుంది. మీరు అలాంటి మహిళేనా? లేదా అలాంటి మహిళలు మీకు తెలుసా? అయితే అలాంటి మహిళల స్టోరీస్ #SheInspireUsతో ట్యాగ్ చేయండి అని ట్వీట్ చేశారు.
ట్విటర్, ఫేస్ బుక్,ఇన్ స్టాగ్రామ్ లో మోడీ చాలా చురుగ్గా ఉంటారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఈ విషయాన్ని ఇటీవల ప్రస్తావించారు. ట్విటర్లో మోడీకి 5.33 కోట్లమంది ఫాలోవర్లున్నారు. 5 కోట్లకు పైగా ట్విటర్ ఫాలోవర్లు ఉన్న తొలి భారతీయుడు మోడీనే. ఫేస్బుక్లో 4.4 కోట్ల మంది, ఇన్స్ట్రాగామ్లో 3.52 కోట్ల మంది ఆయనను ఫాలో అవుతుంటారు. ప్రధాని కార్యాలయ ట్వీటర్ అకౌంట్ను 3.2 కోట్ల మంది అనుసరిస్తున్నారు. సెప్టెంబర్ 2019లో ప్రపంచవ్యాప్తంగా ట్విటర్లో అత్యధికులు ఫాలో అవుతున్న మూడో నేత నరేంద్ర మోడీనే. తొలి రెండు స్థానాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు ఒబామా ఉన్న విషయం తెలిసిందే.