Chandrababu : అంతిమ విజయం న్యాయానిదే, త్వరలోనే బయటకు వస్తా, నియంత పాల‌న‌పై పోరాటం కొన‌సాగించండి- తెలుగు ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు బ‌హిరంగ లేఖ

ఓట‌మి భయంతో జైలు గోడ‌ల మ‌ధ్య బంధించి ప్ర‌జ‌ల‌కి న‌న్ను దూరం చేశామ‌నుకుంటున్నారు. ప్ర‌జ‌లే నా కుటుంబం. Chandrababu

Chandrababu : అంతిమ విజయం న్యాయానిదే, త్వరలోనే బయటకు వస్తా, నియంత పాల‌న‌పై పోరాటం కొన‌సాగించండి- తెలుగు ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు బ‌హిరంగ లేఖ

Chandrababu Open Letter

Chandrababu Open Letter : స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు ప్ర‌జ‌ల‌కు జైలు నుంచి బ‌హిరంగ లేఖ రాశారు. ములాఖ‌త్‌లో భాగంగా తనను క‌లిసిన కుటుంబ‌స‌భ్యుల‌కు తెలుగు ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి తాను రాసిన లేఖని అంద‌జేశారు. త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తానన్న చంద్రబాబు, అప్పటివరకు నియంత పాలనపై శాంతియుత పోరాటం కొనసాగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

చంద్రబాబు లేఖలోని అంశాలు
‘నేను జైలులో లేను. ప్ర‌జ‌ల హృద‌యాల్లో ఉన్నాను. ప్ర‌జ‌ల నుంచి న‌న్ను ఒక్క క్ష‌ణం కూడా ఎవ్వ‌రూ దూరం చేయ‌లేరు. 45 ఏళ్లుగా నేను కాపాడుకుంటూ వ‌స్తున్న విలువ‌లు, విశ్వ‌స‌నీయ‌త‌ని చెరిపేయ‌లేరు. ఆల‌స్య‌మైనా న్యాయం గెలుస్తుంది. నేను త్వ‌ర‌లో బ‌య‌ట‌కొస్తాను. ప్ర‌జ‌ల కోసం, రాష్ట్ర ప్ర‌గ‌తి కోసం రెట్టించిన ఉత్సాహంతో ప‌ని చేస్తాను.

అంద‌రికీ ద‌స‌రా శుభాకాంక్ష‌లు. ఓట‌మి భయంతో జైలు గోడ‌ల మ‌ధ్య బంధించి ప్ర‌జ‌ల‌కి న‌న్ను దూరం చేశామ‌నుకుంటున్నారు. ప్ర‌జ‌లే నా కుటుంబం. జైలు గోడ‌ల మ‌ధ్య కూర్చుని ఆలోచిస్తూ ఉంటే 45 ఏళ్ల ప్ర‌జా జీవితం నా క‌ళ్ల ముందు కదలాడుతోంది. నేను మీ మధ్య తిరుగుతూ ఉండకపోవ‌చ్చు. కానీ అభివృద్ధి రూపంలో ప్ర‌తీచోటా క‌నిపిస్తూనే ఉంటాను.

Also Read : మేము అధికారంలోకి రాగానే దీనిపైనే తొలి విచారణ జరిపిస్తాం: పవన్ కల్యాణ్

త్వరలో వస్తా, మేనిఫెస్టో విడుద‌ల చేస్తా..
కుట్ర‌ల‌తో నాపై అవినీతి ముద్ర వేయాల‌ని ప్ర‌య‌త్నించారు. కానీ, నేను న‌మ్మిన విలువ‌లు, విశ్వ‌స‌నీయ‌త‌ని ఎన్న‌డూ చెరిపేయ‌లేరు. ఈ చీక‌ట్లు తాత్కాలిక‌మే. సంకెళ్లు నా సంకల్పాన్ని బంధించలేవు. జైలు గోడ‌లు నా ఆత్మ‌విశ్వాసాన్ని దెబ్బతీయలేవు. జైలు ఊచ‌లు న‌న్ను ప్ర‌జల నుంచి దూరం చేయ‌లేవు. నేను తప్పు చేయను, చేయనివ్వను. ఈ దసరాకి పూర్తి స్థాయి మ్యానిఫెస్టో విడుదల చేస్తానని రాజ‌మ‌హేంద్ర‌వ‌రం మహానాడులో ప్రకటించాను. అదే రాజ‌మ‌హేంద్ర‌వ‌రం జైలులో న‌న్ను ఖైదు చేశారు. త్వరలో బయటకొచ్చి పూర్తి స్థాయి మ్యానిఫెస్టో విడుద‌ల చేస్తాను.

మీ కోసం రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తాను..
నా ప్ర‌జ‌ల కోసం, వారి పిల్ల‌ల భ‌విష్య‌త్తు కోసం రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తాను. నేను అందుబాటులో లేని ఈ కష్ట కాలంలో ప్ర‌జ‌ల్లోకి వెళ్లి వారి త‌ర‌పున పోరాడాల‌ని నా భార్య భువ‌నేశ్వ‌రిని నేను కోరాను. ఆమె అంగీక‌రించింది. నా అక్ర‌మ అరెస్టుతో త‌ల్ల‌డిల్లి మృతి చెందిన వారి కుటుంబాల‌ని ప‌రామ‌ర్శించి, అరాచ‌క‌ పాల‌నను ఎండ‌గ‌ట్ట‌డానికి ‘నిజం గెల‌వాలి’ అంటూ మీ ముందుకు వ‌స్తోంది. నా క్షేమం కోసం కుల‌, మ‌త‌, ప్రాంతాల‌కు అతీతంగా మీరు చేసిన ప్రార్థ‌న‌లు ఫ‌లిస్తాయి. న్యాయం ఆల‌స్యం అవ్వొచ్చునేమో. కానీ, అంతిమంగా గెలిచేది మాత్రం న్యాయ‌మే. మీ అభిమానం, ఆశీస్సుల‌తో త్వ‌ర‌లోనే బయటకి వ‌స్తాను. అంత‌వ‌ర‌కూ నియంత పాల‌న‌పై శాంతియుత పోరాటం కొన‌సాగించండి’.

Also Read : దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం.. చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్