Student Leader Murder Case : కోరిక తీర్చాలని వేధించిన విద్యార్ధి సంఘ నాయకుడు….
విద్యార్ధి సంఘ నాయకుడిగా చెలామణి అవుతున్న వ్యక్తి ప్రేమికుల జంటను బెదిరించాడు.
Student Leader Murder Case : విద్యార్ధి సంఘ నాయకుడిగా చెలామణి అవుతున్న వ్యక్తి ప్రేమికుల జంటను బెదిరించాడు. వారి విషయం ఇంట్లోవాళ్లకు తెలియకుండా ఉండాలంటే యువతి తన కోరిక తీర్చాలని బెదిరించసాగాడు. బెదిరింపులు భరించలేని ప్రేమికుడు ఆ నాయకుడిని తుదుముట్టించిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.
ఉరవకొండ పోలీసు స్టేషన్ పరిధిలోని వజ్రకరూర్ కు చెందిన మండ్ల తిరుపాల్ యునైటెడ్ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకుడు. అదే గ్రామానికి చెందిన బెస్త గురుమూర్తి ఒక అమ్మాయితో రెండేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. వీరిద్దరూ రహస్యంగా కలుసుకుంటున్న సంగతి తిరుపాల్ కు తెలిసింది. మీ ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలియకుండా ఉండేందుకు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. గురుమూర్తి. తిరుపాల్కు డబ్బులు ఇచ్చాడు. అంతటితో ఆగని తిరుపాల్ కొత్త కోరిక కోరాడు. గురుమూర్తి ప్రేమించిన యువతి తన కోరిక తీర్చాలని బలవంతం చేశాడు.
అడిగినంత డబ్బు ఇచ్చినా…తన ప్రియురాలు అతని కామవాంఛ తీర్చాలన్న తిరుపాల్ డిమాండ్ను గురుమూర్తి తట్టుకోలేక పోయాడు. తిరుపాల్ అడ్డు తొలగించుకోవాలని చూశాడు. తమ గ్రామానికి చెందిన కురుబ ఆవుల ఎర్రిస్వామిని సంప్రదించి రూ. 3.5 లక్షలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈమేరకు ఎర్రిస్వామి తన స్నేహితులు చాకలి సునీల్, మఠం వేణుగోపాల్తో కలిసి అక్టోబర్ 24 న పార్టీ చేసుకుందాం రమ్మనమని చెప్పి తిరుపాల్ను వజ్రకరూర్ గ్రామంలోని చింతలపల్లి రోడ్డులో గల కనుమమిట్ట వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ కత్తులతో పొడిచి గొంతుకోసి చంపేశారు.
Also Read : Extra Marital Affair : ఆరేళ్లుగా వివాహేతర సంబంధం-జంటగా ఆత్మహత్య
మృతదేహాం ఆనవాళ్లు దొరక్కుండా షర్టుతో చేతులు రెండు కట్టేసి….తల నుంచి మొండెం వరకు గోనె సంచిలో కుక్కి, మొండెం నుంచి కాళ్ల వరకు చీర చుట్టి, కాళ్లకు బండరాయి కట్టి….కమలపాడు గ్రామానికి చెందిన కురుబ నాగప్ప పొలంలోని వ్యవసాయ బావిలో పడేశారు. తిరుపాల్ కు చెందిన బజాజ్ సీటీ100 మోటార్ సైకిల్ను, హత్యకు ఉపయోగించిన కత్తులను కూడా అందులోనే వేశారు.
తిరుపాల్ కనిపించటం లేదని కుటుంబ సభ్యులు వజ్రకరూర్ పోలీసు స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు గుంతకల్లు డీఎస్పీ నరసింగప్ప పర్యవేక్షణలో ఉరవకొండ సీఐ శేఖర్, వజ్రకరూర్ ఎస్ఐ వెంకటస్వామిలు తిరుపాల్ మిస్సింగ్ కేసు విచారణ చేపట్టారు. కేసు విచారణలో దొరికిన ఆధారాలతో గురుమూర్తి, ఆవుల ఎర్రిస్వామి, చాకలి సునీల్, మఠం వేణుగోపాల్ ను నిన్న అరెస్ట్ చేశారు. వీరి నుంచి పల్సర్ బైక్, రెండు కత్తులు, రెండు బంగారు ఉంగరాలు, రెండు వెండి కడియాలు, వెండి చైనుతో పాటు రూ.80వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. తిరుపాల్ హత్య కేసులోని నిందితులపై గతంలో పలు దారిదోపిడీ కేసులు నమోదై ఉన్నాయని డీఎస్పీ తెలిపారు.