వందేళ్ల తర్వాత : ఏపీలో జనవరి నుంచి సమగ్ర భూ సర్వే

  • Published By: murthy ,Published On : November 5, 2020 / 08:34 PM IST
వందేళ్ల తర్వాత : ఏపీలో జనవరి నుంచి సమగ్ర భూ సర్వే

AP Government to start land resurvey from january 2021 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూములన్నింటినీ రీసర్వే చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఈ ప్రక్రియ కోసం 4,500 సర్వే టీమ్‌లను సిద్దం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. సమగ్ర భూసర్వే కోసం రూ. 1000 కోట్లు కేటాయించామని….. 2021 జనవరి నుంచి  2023 జూన్  నాటికి దశల వారీగా రీసర్వే పూర్తి చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

భూ సమస్యల పరిష్కారానికి మొబైల్ కోర్టుల ఏర్పాటు చేస్తామని, గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకుంటామని కన్నబాబు తెలిపారు. ఫిజికల్ బౌండరీలను ఫిక్స్ చేస్తామని….. సర్వే రాళ్లను ప్రభుత్వమే ఇస్తుందని పేర్కొన్నారు.

వందేళ్ల తర్వాత రాష్ట్రంలో మళ్లీ  భూ సర్వేను చేయబోతున్నట్లు మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సమగ్ర భూ సర్వేకు సంబంధించి పలు కీలక విషయాలు వెల్లడించారు.

>  వైఎస్సార్ జగనన్న శాశ్వత భూమి హక్కు- భూమి రక్షణ పేరుతో అన్ని భూముల రీ-సర్వేకు నిర్ణయం
>  గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూములన్నింటినీ రీ-సర్వే
>  8 మెడికల్ కాలేజీలకు భూముల కేటాయింపు
>  గుంటూరు ప్రభుత్వాస్పత్రి విస్తరణకు 6 ఎకరాల కేటాయింపు
>  విజయవాడలో అనాధాశ్రమం, శిశు భవన్ కోసం మిషనరీ ఆఫ్ ఛారిటీసుకు లీజు పద్దతిన భూ కేటాయింపులు
>  వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని నవంబర్ 17న ప్రారంభం
>  గత ప్రభుత్వంలోని సున్నా వడ్డీ బకాయిలు రూ. 1051 కోట్లు ఇవ్వనున్నాం

>  ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్‌లోనే అందిస్తున్నాం
>  అక్టోబర్ పంట నష్టం పదో తేదీన ఎన్యూమరేషన్ పూర్తి అవుతుంది
>  ఈ నెలాఖరులోగానే ఇన్ పుట్ సబ్సిడీని అందించనున్నాం.
>  ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో స్టేడియాల ఏర్పాటు
>  శ్రీకాకుళం, కడప జిల్లాల్లో క్రికెట్ స్టేడియాల నిర్మాణానికి భూ కేటాయింపులు
>  ఐదేళ్ల శిక్ష పూర్తి చేసుకున్న 48 ఏళ్లకు పైబడిన మహిళలకు విముక్తి
వారి విడుదలకు కెబినెట్ ఆమోదం
>  ఈ మేరకు గవర్నర్ ఆమోదం కోరాలని కెబినెట్‌ నిర్ణయం
>  వైద్యారోగ్య శాఖలోని టీచింగ్ స్టాఫునకు యూజీసీ స్కేల్ అమలుకు నిర్ణయం.
>  ఏడాదికి రూ. 400 కోట్లకు పైగా భారం.. 3500 మందికి లబ్ది

విశాఖలో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం ఇచ్చిందని కన్నబాబు తెలిపారు. 150 ఎకరాల్లో డేటా సెంటర్ ఏర్పాటుకు అంగీకారం కుదిరిందని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో అదానీ గ్రూప్ డేటా సెంటరుకు 500 ఎకరాలు కేటాయించగా… జగన్ ప్రభుత్వం వచ్చాక అదానీ డేటా సెంటర్ వెళ్లిపోయిందని చంద్రబాబు చేసిన విమర్శలు నిజం కాదని తేలిపోయిందని ఆయన తెలిపారు.

వివిధ సంక్షేమ పథకాల్లో లబ్ది పొందని అర్హులకు సంక్షేమ పథకాల వర్తింపునకు చర్యలు చేపడతామని….ఈ ప్రక్రియ నవంబర్ ఆరో తేదీ నుంచే ప్రారంభించనున్నామని ఆయన వివరించారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకాన్ని నవంబర్ పదో తేదీ నుంచి మరో ఆరు జిల్లాల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు.