కాబోయే భార్యతో మాట్లాడి వస్తుండగా మృత్యువు కాటేసింది…

మరికొద్ది రోజుల్లో వారిద్దరికీ వివాహం జరగబోతుంది. వివాహ ఏర్పాట్ల విషయంపై పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తే కుటుంబాలు చర్చించుకుంటున్నాయి. ఆటోలో ఉన్న కాబోయే భార్యతో మాట్లాడి వస్తుండగా పెళ్లి కుమారుడిని మృత్యువు కబలించింది.

కాబోయే భార్యతో మాట్లాడి వస్తుండగా మృత్యువు కాటేసింది…

Bridegroom killed in road accident : వివాహ ముహూర్తం ఖరారైంది. మరికొద్ది రోజుల్లో వారిద్దరికీ వివాహం జరగబోతుంది. వివాహ ఏర్పాట్ల విషయంపై పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తే కుటుంబాలు చర్చించుకుంటున్నాయి. రోడ్డుకు అటువైపు ఆటోలో ఉన్న కాబోయే భార్యతో మాట్లాడి వస్తుండగా పెళ్లి కుమారుడిని మృత్యువు కబలించింది.

పెళ్లి కుమార్తె ఆటోలో ఉందన్న విషయం తెలిసిన ఆ యువకుడు ఆమెను చూసేందుకు వెళ్లాడు. ఆమెతో కొద్దిసేపు మాట్లాడి ‘బాయ్‌’ చెప్పి వెనక్కి తిరిగేలోపు వెనకనుంచి వస్తున్న బస్సు ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన విజయనగరం ‌జిల్లా బియ్యాలపేట వద్ద సోమవారం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుంకరిపేటకు చెందిన ఎస్‌.రామకృష్ణ (24)కు మే 30న వివాహం నిశ్చయమైంది. బియ్యాలపేట వద్ద రోడ్డు పక్కన ఆటోలో వధువు ఉందని తెలుసుకున్న రామకృష్ణ అక్కడకు వెళ్లి పలకరించి వెనక్కి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో సుంకరిపేట మెయిన్ రోడ్డుపై లెండి కాలేజీకి చెందిన బస్సు రామకృష్ణను ఢీకొట్టింది. దీంతో బస్సు టైరు అతని తలభాగంపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.

మరికొద్దిరోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన కుమారుడికి ఇలాంటి దుస్థితి వస్తుందనుకోలేదని తల్లిదండ్రులు సుంకరి బంగారునాయుడు, అప్పయమ్మ, కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. యువకుడి మృతితో కుటుంబీకులు, స్థానికులు ఆగ్రహావేశాలకు గురై, రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కాలేజీ యాజమాన్యం వచ్చే వరకూ మృతదేహాన్ని తరలించేది లేదని తేల్చి చెప్పారు.

పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, గ్రామస్తులకు నచ్చజెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ పి.నారాయణరావు తెలిపారు.