Kasibugga stampede incident : కాశీబుగ్గలో తొక్కిసలాట ఘటన.. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు, 12ఏళ్ల బాలుడు.. ప్రమాదం ఇలా జరిగింది.. మృతులు వీరే
Kasibugga stampede incident : చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వారిని శ్రీకాకుళం రిమ్స్ కు
Kashibugga Stampede incident
Kasibugga stampede incident : శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో తొమ్మిది మంది భక్తులు మరణించగా.. పలువురు గాయపడ్డారు. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు, 12 ఏళ్ల బాలుడు ఉన్నారు. ఘటనతో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వారిని శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు.
తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారిలో ఏచూరి చిన్నమ్మ (50) – టెక్కలి, రాపాక విజయ (48) – టెక్కలి, ముర్రుపెంట నీలమ్మ (60) – వజ్రపుకొత్తూరు, దువ్వు రాజేశ్వరి (60) – మందస, చిన్ని యశోదమ్మ (56) – నందిగాం ఉన్నారు. మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. సాయంత్రం 5గంటలలోపు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు. కాశీబుగ్గ దుర్ఘటనకు సంబంధించి కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు (కంట్రోల్ రూం నంబర్ 08942 240557) ఏర్పాటు చేశారు.
హోం మంత్రి అనిత ఏం చెప్పారంటే..
ఈ ఆలయానికి ప్రతి వారం 1,500 నుంచి 2 వేలమంది భక్తులు వస్తారు. ఆలయం మొదటి అంతస్తులో ఉంది. భక్తులు 20 మెట్లు ఎక్కి పైకి వెళ్లే క్రమంలో రెయిలింగ్ కూలింది. రెయిలింగ్ కూలడంతో భక్తులు ఒకరిపై ఒకరు పడడంతో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుందని హోమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించామని అన్నారు.
మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఏమన్నారంటే..
కాశీబుగ్గ ఆలయం పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులు అధీనంలో ఉన్న దేవాలయం అని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఈ ఆలయం పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో నడుస్తున్నదని, దేవాదాయ శాఖకు, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు. సుమారు 2000 మంది మాత్రమే పట్టే ఈ దేవస్థానానికి ఒక్కసారిగా 25వేల మంది భక్తులు రావడంతో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణ చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో నడుస్తున్న ఆలయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ప్రైవేట్ వ్యక్తులు ఎటువంటి సమాచారం ప్రభుత్వానికి, దేవాదాయ శాఖకు అందించలేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.

క్షతగాత్రులకు సీదిరి అప్పలరాజు వైద్యం..
తొక్కిసలాట సమాచారం అందుకున్న వెంటనే మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజు ఘటన స్థలికి వెళ్లారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు వైద్య సాయం అందించారు. ఈ సందర్భంగా సీదిరి అప్పలరాజు ఓ ప్రకటనలో.. కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం ఎంతో విచారకరం. ఈ దుర్ఘటన తీవ్రంగా బాధించింది. మృతుల కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తూ.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అన్నారు.
