Love Couple Suicide : రైలుకింద పడి యువ ప్రేమజంట ఆత్మహత్య.. కారణం ఫేస్ బుక్కేనా?

Love Couple Suicide : రైలుకింద పడి యువ ప్రేమజంట ఆత్మహత్య.. కారణం ఫేస్ బుక్కేనా?

Love Couple Suicide

Ongole Love Couple Suicide Case : ప్రకాశం జిల్లాలో ప్రేమజంట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదం నింపింది. మృతులను ఒంగోలు మండలం కొప్పోలుకు చెందిన విష్ణువర్ధన్‌ రెడ్డి, ఒంగోలు వెంకటేశ్వర కాలనీకి చెందిన ఇందుగా గుర్తించారు. మంగళవారం(మార్చి 23,2021) ఒంగోలు సమీపంలో ప్రేమ జంట సూసైడ్ చేసుకుంది. ప్రేమ జంట ఆత్మహత్య కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది.

కొప్పోలుకు చెందిన భవనం వెంకటేశ్వరరెడ్డి, సుజాత దంపతుల రెండో కొడుకు విష్ణువర్థన్ రెడ్డి. నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు కూలి పనులు చేస్తారు. అదే వారి జీవనాధారం. విష్ణు ఒంగోలు సమీపంలోని ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ సెకండియర్ చదువుతున్నాడు. కాగా, తనకు స్మార్ట్‌ ఫోన్‌ కావాలని విష్ణు అడగటంతో.. తల్లి సుజాత కష్టం చేసి దాచిన రూ.12 వేలతో ఫోన్ కొనిచ్చింది.

ఫోన్ చేతికి వచ్చాక విష్ణు పూర్తిగా మారిపోయాడు. ఎక్కువ సమయం ఫోన్‌తో గడుపుతున్నాడు. ఈ క్రమంలో అతడికి ఒంగోలు వెంకటేశ్వర కాలనీకి చెందిన ఇందు ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. ఇందు ఒంగోలులోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఆమె తండ్రి ఏడాది కిందట చనిపోవంతో తల్లి, సోదరుడితో కలిసి ఉంటోంది. ఇంట్లోని ఒక పోర్షన్‌ను అద్దెకు ఇవ్వడంతో వచ్చే కొద్దిపాటి డబ్బు, తల్లికి వచ్చే పింఛనే ఆ కుటుంబానికి ఆధారం.

ఇందు, విష్ణుల మధ్య పరిచయం ప్రేమగా మారింది. కొన్నిరోజుల క్రితం యువతి తన కుమారుడికి తరచూ ఫోన్‌ చేస్తుండటాన్ని సుజాత గమనించింది. ఈ విషయం తల్లికి తెలియడంతో విష్ణు తన ఫోన్‌ను పగలగొట్టాడు. ఆ తర్వాత తన స్నేహితుడి మొబైల్‌ నుంచి ఇందుతో టచ్‌లో ఉన్నాడు. కాగా, సోమవారం(మార్చి 22,2021) రాత్రి పెరుగు ప్యాకెట్‌ తెస్తానని ఇందు బయటకు వెళ్లింది. కానీ తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. చుట్టు పక్కల వెతికినా లాభం లేకపోయింది.

ఇంతలో.. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం సమీపంలోని ఐఓసీ పెట్రోలు బంకు వెనుక రైల్వే ట్రాక్‌పై యువ జంట ఆత్మహత్య చేసుకున్నట్టు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి సమీపంలో దొరికిన హాల్‌ టికెట్‌ ఆధారంగా పోలీసులు ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థిగా గుర్తించారు. కాలేజీలో వివరాలు సేకరించారు.

విష్ణుకి 9 నెలల కిందట ఫేస్‌బుక్‌లో ఇందు పరిచయం అయినట్టు పోలీసులు తెలుసుకున్నారు. ఆ తర్వాత పరిచయం ప్రేమగా మారింది. అయితే వీరి ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాల పెద్దల దృష్టికి రాలేదని పోలీసులు చెబుతున్నారు. ఇందు ఎక్కడికి వెళ్లిందో తెలియక వెతుకుతూనే ఉన్నామని, విష్ణుతో ప్రేమలో ఉందనే విషయం తమకు తెలియదని ఆమె బంధువులు అంటున్నారు. కాగా, తమ ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని, కులాంతర వివాహానికి అడ్డంకులు వస్తాయనే భయంతోనే వారు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తానికి ఎంతో భవిష్యత్తు ఉన్న ఆ ఇద్దరు.. ఇలా అర్థాంతరంగా ప్రాణాలు తీసుకోవడం అందరిని ఆవేదనకు గురి చేసింది. తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. తమ పిల్లలు ఇంత పని చేస్తారని అస్సలు ఊహించలేదు.