శ్రావణమాసం పరమ పవిత్రం : నిత్యం విశేషాలే

  • Published By: madhu ,Published On : July 21, 2020 / 08:32 AM IST
శ్రావణమాసం పరమ పవిత్రం : నిత్యం విశేషాలే

శ్రావణమాసం ప్రారంభమైంది. 2020, జులై 21వ తేదీ మంగళవారం నుంచి ప్రారంభమైన ఈ మాసాన్ని
శుభాల మాసంగా పిలుస్తుంటారు. ఇది ఒక విధంగా అధ్యాత్మిక మాసం అని చెప్పవచ్చు. ఈ నెలలో అన్ని రోజులు మంచివే. పలు పండుగలు ఈ నెలలో వస్తాయి.

రాఖీపౌర్ణమి, హయగ్రీవ జయంతి, శ్రీకృష్ణాష్టమి, పొలాల అమావాస్య, నాగుల పంచమి, వరలక్ష్మీ వ్రతం తదితర పండుగలు ఈ నెలలో వస్తాయి. ఈ మాసం ప్రధానంగా మహిళలకు ప్రత్యేకమైనది. ప్రతి ఇంట్లో పూజలతో అధ్యాత్మిక వాతావరణం ఉంటుంది.

ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అర్చనలు, ఇతర విశేషాలు జరుగుతుంటాయి. కానీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో…ఆలయాల్లో అంతస్థాయిలో రద్దీ లేదు. ఇంట్లోనే తోచిన విధంగా పూజలు చేసుకుంటున్నారు.

శ్రావణమాసం ప్రత్యేకతలు, ఆచరించాల్సిన నియమాలు : –

ఏడు రోజుల్లో…సోమవారం : – విశిష్టమైనదిగా చెబుతుంటారు. ముక్కంటికి సోమవారం ప్రీతీకరమైనది. ఈ రోజున స్వామిని పూజిస్తే..సమస్త శుభాలు కలుగుతాయని చెబుతుంటారు. లింగస్వరూపుడికి అభిషేకాలు, అర్చనలు చేయాలని, దీనివల్ల శుభాలు కలుగుతాయని పండితులు వెల్లడిస్తున్నారు.

మంగళవారం : –
శ్రావణమాసంలో వచ్చే ప్రతి మంగళవారం ఎంతో ప్రీతీకరమైన రోజు. దేవతలందరినీ భక్తి శ్రద్ధలతో పూజిస్తే శుభాలు కలుగుతాయని నమ్మకం. గౌరీదేవికి పూజలు చేస్తారు. పసుపు ముద్దను తయారు చేసి కుంకుమ పూలు అద్ది అక్షింతలతో పూజలు నిర్వహిస్తుంటారు. ఇక కొత్తగా పెళ్ళైన వారు ఈ వ్రతాన్ని ఆచరించాలంటారు. అవివాహితులు కూడా వ్రతాన్ని చేస్తారు.

బుధవారం, గురువారం :
ఈ రెండు వారాలకు కూడా ప్రాముఖ్యత ఉంది. బుధవారం అయ్యప్పకు, గురువారం రాఘవేంద్ర స్వామి, సాయిబాబా, దక్షిణమూర్తికి ప్రీతికరమైన రోజులు.

శుక్రవారం :
ప్రతి శుక్రవారం ఎంతో ప్రాధాన్యమైంది. వరలక్ష్మీ వ్రతాన్ని కొంతమంది ఆచరిస్తుంటారు. మహాలక్ష్మి విగ్రహానికి అలంకరణ చేసి ఇరుగు, పొరుగు, బంధువులను పిలిచి వ్రతాన్ని నిర్వహిస్తారు. వచ్చిన వారికి తాంబూళం, శనగల ప్రసాదం ఇస్తారు.

ప్రతి ముత్తైదువును మహాలక్ష్మి రూపంగా భావించి గౌరవిస్తారు. వ్రతం చేసిన ముత్తైదువులు తోటి ముత్తైదువులకు గారెలు, పూర్ణాలు, తోచిన విధంగా వాయినాలు ఇస్తుంటారనే సంగతి తెలిసిందే. ఈ వ్రతాన్ని చేసే వారికి అన్ని శుభ శకునాలే కలుగుతాయని నమ్మకం. ఆలయాల్లో, ఇంట్లో కుంకుమార్చనలు చేస్తుంటారు. నవ వధువులతో తప్పనిసరిగా ఈ వ్రతం చేయిస్తుంటారు.

శనివారం : శ్రీనివాసుడికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజున కొంతమంది ఉపవాస దీక్షలు చేస్తుంటారు. స్వామి వారికి పూజలు, అర్చనలు నిర్వహిస్తారు. ఈ మాసంలో ప్రతి శనివారం స్వామి వారిని కొలిస్తే..శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం.

శ్రావణ మాసంలో మొదటి పండుగ మంగళగౌరి వ్రతంగా చెప్పవచ్చు. ఆ తర్వాత నాగుల పంచమి, వరలక్ష్మీ వ్రతం, శ్రావణ పూర్ణిమ, గురు రాఘవేంద్ర స్వామి ఆరాధానోత్సవాలు,
శ్రీకృష్ణాష్టమి పండుగలు వస్తాయి.