Chintamaneni Prabhakar : కోడి పందాలతో నాకేం సంబంధం లేదు-చింతమనేని
హైదరాబాద్ శివారులో దెందులూరు వారి పుంజులు కాలికి కత్తి కట్టి చింతమనేని వారికి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. దెందులూరు పుంజులేంటి? చింతమనేనికి కాసుల వర్షం కురిపించడమేంటి? అనుకుంటున్నారా?
Chintamaneni Prabhakar : హైదరాబాద్ శివారులో దెందులూరు వారి పుంజులు కాలికి కత్తి కట్టి చింతమనేని వారికి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. దెందులూరు పుంజులేంటి? చింతమనేనికి కాసుల వర్షం కురిపించడమేంటి? అనుకుంటున్నారా? సంక్రాంతి సీజన్లో.. అది కూడా కేవలం గోదావరి జిల్లాలకే పరిమితం అనుకున్న కోడి పందాలను హైదరాబాద్ శివారు వరకు తీసుకొచ్చారు టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. గుట్టు చప్పుడు కాకుండా చాలా రోజులుగా హైదరాబాద్ శివారులో కోడి పందాలు కాస్తున్నారు. కానీ సీన్లోకి ఖాకీల ఎంట్రీతో కోళ్లేమో కానీ.. నిర్వాహకులు మాత్రం బెదిరిపోయి కాళ్లకు పని చెప్పారు.
హైదరాబాద్ శివార్లోని పెదకంజర్ల గ్రామంలో చాలా రోజులగా గుట్టు చప్పుడు కాకుండా కోడి పందాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో హైదరాబాద్ పోలీసులు నిఘా వేసి నిన్న దాడులు చేశారు. మొత్తం 70 మందితో కలిసి పెద్ద ఎత్తున బెట్టింగ్ పెట్టి కోడి పందాలు నిర్వహిస్తుండగా పోలీసులు దాడులు చేశారు. కానీ పోలీసులు వచ్చారని తెలియడంతో.. 49 మంది అక్కడ నుంచి పరారయ్యారు. మిగిలిన 21 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారైన వారిలో వీఐపీలు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చింతమనేని కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా చింతమనేని ప్రభాకర్ కర్ణాటకలో కూడా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
ఈ పందాల ప్రధాన నిర్వాహకుడు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్గా గుర్తించారు పోలీసులు. ఆయనతో పాటు కీలకంగా వ్యవహరిస్తున్న ముగ్గురు నిర్వాహకులు అక్కినేని సతీష్, బర్ల శ్రీనులను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. కానీ అప్పటికే పోలీసులు వచ్చారని తెలియడంతో చింతమనేని ప్రభాకర్ పరారయ్యారని పట్టుబడ్డ వారు చెప్పినట్టు తెలుస్తోంది. పోలీసుల దాడిలో నిందితుల నుంచి 13 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరికి చెందిన 26 వాహనాలు, 32 పందెం కోళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏదైనా సమయం సందర్భం కాని వేళలో.. హైదరాబాద్లో అది కూడా రాజకీయ నేతలే ఈ కోడి పందాలను దగ్గరుండి నిర్వహిస్తుండడం ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారి తీసిందనే చెప్పాలి.
కాగా హైదరాబాద్ శివారులో నిర్వహించిన కోడి పందాలపై స్పందించారు టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. కోడి పందాల్లో లేని వ్యక్తిని ఉన్నట్టుగా చూపిస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. దీనికి సంబంధించి ఓ ట్వీట్ చేశారు. రాజకీయాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలని.. ఇంత రాజీకయం అవసరమా అని ప్రశ్నించారు. ఈ ప్రచారాన్ని ఇకనైనా ఆపాలని కోరారు. అయితే పోలీసులు మాత్రం కోడి పందాలను నిర్వహించేది చింతమనేని అని.. కర్ణాటకలో కూడా కోడి పందాలను నిర్వహిస్తున్నట్టు గుర్తించామన్నారు. ప్రస్తుతం చింతమనేని పరారీలో ఉన్నారని.. ఆయన కోసం గాలిస్తున్నామన్నారు.