అక్రమ సంబంధానికి ఒప్పుకోలేదని గొంతు కోశాడు

అక్రమ సంబంధానికి ఒప్పుకోలేదని గొంతు కోశాడు

ఒంటరిగా ఉన్న ఆడది అంటే అందరూ ఆవురావురు మంటూ ఆకలి చూపులు చూస్తుంటారు. వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కడూ ఆమెను అనుభవించాలనే చూస్తాడు. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటూ జీవనోపాధికోసం టీ కొట్టు పెట్టుకున్న మహిళపై కన్నేశాడో కామాంధుడు. అందుకు ఆమె ఒప్పుకోక పోవటంతో గొంతు కోసేశాడు.

వికారాబాద్ జిల్లా యాలాలలోని మిత్రనగర్ కు చెందిన పద్మ అనే మహిళ… భర్తతో విభేదాల కారణంగా అతడ్ని వదలిపెట్టి కొన్నేళ్లుగా ఒంటరిగా జీవిస్తోంది. బతుకు తెరువు కోసం  టీ కోట్టు పెట్టుకుని జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో అదే మండలంలోని హాజీ పూర్ గ్రామానికి  చెందిన నర్సింహులు అనే వ్యక్తి పద్మపై కన్నేశాడు.

తనతో వివాహేతర సంబంధం పెట్టుకోమని ఆమెను లైంగికంగా వేధించటం మొదలెట్టాడు. తనతో వివాహేతర సంబంధం పెట్టుకుంటే తానే పోషిస్తానని చెప్పుకొచ్చాడు. ఈ విషయమై కొన్ని సార్లు ఆమె ఇంటికి వెళ్లి కూడా చెప్పాడు. అయితే తనకు అలాంటి ఉద్దేశం లేదని పద్మ అతడి ప్రతిపాదనను తిరస్కరిస్తూ వచ్చింది.

అయినా పట్టు వదలని నర్సింహులు అవకాశం ఉన్నప్పుడల్లా ఈ విషయం ఆమె వద్ద ప్రస్తావిస్తూ వస్తున్నాడు. ఆమె నిరాకరిస్తూనే ఉంది. విసిగిపోయిన నర్సింహులు మంగళవారం ఉదయం  పద్మ టీ కొట్టు వద్దకు వచ్చి కత్తితో దాడి చేసి…ఆమె గొంతు కోసి పరారయ్యాడు. ఇది గమనించిన స్ధానికులు ఆమెను వెంటనే తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రధమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ఈఎన్టీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.