గుంటూరులో కిరాతకం : కిడ్నాప్ అయిన బాలుడు హత్య
కిడ్నాప్ సుఖాంతం అవుతుందని అందరూ అనుకున్నారు. కొడుకు క్షేమంగా వస్తాడని ఊహించిన ఆ తల్లిదండ్రులకు షాక్ తగిలింది. కిడ్నాపర్లు గర్భశోకాన్ని మిగిల్చారు. గుంటూరు జిల్లాలో ఆరేళ్ల బాలుడి కిడ్నాప్ ఘటన విషాదాన్ని నింపింది. కిడ్నాప్కు గురైన సాయి సాత్విక్ చెరువులో విగతజీవుడిగా తేలాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. సమాచారాన్ని పేరెంట్స్కు తెలియచేశారు. అక్కడకు వచ్చిన తర్వాత మృతదేహాన్ని బయటకు తీశారు. చిన్నారి తమ కొడుకని గుర్తించి..ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. అయ్యో.. అంటూ క్షోభిస్తున్న ఆ తల్లిదండ్రుల పుత్రశోకం అందర్నీ కంట తడిపెట్టించింది.
సరోజ, వెంకటేశ్వర్లు దంపతులు మాచర్లలోని నెహ్రూ నగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి సాయి సాత్విక్ (6) కుమారుడున్నాడు. ఏప్రిల్ 22వ తేదీ సాయంత్రం సాయి సాత్విక్ బయట ఆడుకుంటున్నాడు. స్థానికంగా ఉన్న వారు సరోజ ఇంటికి వచ్చి..సాత్విక్ని ఎవరో ఎత్తుకెళుతున్నారని చెప్పారు. వెంటనే పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు బృందాలుగా విడిపోయి కిడ్నాపర్ కోసం గాలించారు. అయినా ఫలితం దక్కలేదు.
ఏప్రిల్ 25వ తేదీ మాచర్ల సమీపంలోని క్వారీ గుంతలో ఉన్న చెరువులో చిన్నారి మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు వారు చేరుకుని సరోజ, వెంకటేశ్వర్లకు విషయం తెలియచేశారు. అక్కడకు వచ్చిన వారు భోరున విలపించారు. కిడ్నాపర్ చేసిన ఘాతుకంపై పోలీసులు సీరియస్గా ఉన్నారు. అతడి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఎందుకు చంపాల్సి వచ్చింది ? అనే దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు.