Fake Currency Gang : తీగ లాగితే డొంక కదిలింది… నకిలీ నోట్లు చలామణి చేస్తున్న జ్యోతిష్యుడు
రంగురాళ్లు దొంగతనం జరిగిందని నమోదైన కేసులో ఫిర్యాదుదారు పెద్ద నేరస్తుడని పోలీసులు తేల్చారు.
Fake Currency Gang : రంగురాళ్లు దొంగతనం జరిగాయని నమోదైన కేసులో ఫిర్యాదు దారుడే పెద్ద నేరస్తుడని పోలీసులు తేల్చారు. హైదరాబాద్ నాగోల్లో వారం రోజుల క్రితం జోతిష్యుడు మురళీకృష్ణ శర్మ ఇంట్లో రూ.40 లక్షల విలువైన రంగురాళ్లు చోరీ అయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో మురళీకృష్ణశర్మ ఇంట్లో పోలీసులు తనిఖీ చేయగా 17 కోట్ల విలువైన నకిలీ 2వేల రూపాయల నోట్లు బయటపడ్డాయి. దీంతో రంగురాళ్ల చోరీ కేసు కొత్త మలుపు తిరిగింది.
జోతిష్యుడు మురళీకృష్ణ శర్మ నకిలీ నోట్లు చెలామణి చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. మురళీకృష్ణశర్మ గతంలో రూ. 90 కోట్ల హవాలా మనీ కేసులో జైలుకు వెళ్లివచ్చినట్లు గుర్తించారు. నిందితుడు మురళీకృష్ణ నుంచి 6 లక్షల నగదు, కారు, 10 మొబైల్స్, 17 కోట్ల 72 లక్షల నకిలీ 2వేల నోట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈకేసుకు సంబంధించి గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన మరో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా దొంగ నోట్లు చలామణీ చేస్తున్నట్లు గుర్తించారు. ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.