వృత్తి టెన్నిస్ కోచ్ : ప్రవృత్తి దొంగతనాలు 

  • Published By: chvmurthy ,Published On : May 16, 2019 / 01:41 PM IST
వృత్తి టెన్నిస్ కోచ్ : ప్రవృత్తి దొంగతనాలు 

హైదరాబాద్: ఒకసారి దొంగతనాలకు అలవాటు పడిన వ్యక్తి జైలు శిక్ష అనుభవించి, వృత్తి మార్చుకున్నా ప్రవృత్తి మాత్రం మానలేక పోయాడు. హైదరాబాద్ లో గతంలో జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చినా దొంగతనాలు మానలేదు. ఏప్రిల్ నెలలో మళ్లీ దొంగతనం చేసి పోలీసులకు చిక్కి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.  మాదాపూర్‌ జోన్‌ డీసీపీ వెంకటేశ్వరరావు కూకట్పల్లి పోలీసు స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ దొంగ వివరాలు వెల్లడించారు. రాజమండ్రికి చెందిన  కోమలి రామకృష్ణ(24) అనే వ్యక్తి ఇంటర్మీడియేట్ వరకు చదువుకున్నాడు. ఇతని అమ్మమ్మకు కొడుకులు లేకపోవటంతో ఇతడినే కొడుకులాగా పెంచింది. 2012 లో రాజమండ్రిలో జరిగిన ఓచోరీ కేసులో బాల నేరస్తుడిగా జువైనల్ హోమ్కు వెళ్లొచ్చాడు. అయినా అతని తీరు మారలేదు. రాజమండ్రి, ధవళేశ్వరం, రాజానగరం లలో దొంగతనాలు కొనసాగించాడు. రామకృష్ణపై రాజమండ్రిలోని వివిధ పోలీసు స్టేషన్లలో 6 కేసులు నమోదయ్యాయి. జైలుశిక్ష అనుభవించి, విడుదలయ్యాక 2017లో హైదరాబాద్ వచ్చాడు.
 
నిజాంపేటలో బంధువుల ఇంట్లో ఉంటూ కూరగాయలు అమ్మేవాడు. కూరగాయలు అమ్మూతూనే గతేడాది స్ధానికంగా ఉన్న వర్టెక్స్ అపార్ట్ మెంట్లో చోరీ చేసి పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు. జైలు నుంచి విడుదలయ్యాక కేపీహెచ్బీ, జలవాయు విహార్లో టెన్నిస్ కోచ్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు. కొత్త ఉద్యోగంలో చేరినా రామకృష్ణ తన ప్రవృత్తి మాత్రం మార్చుకోలేకపోయాడు. తనకు పరిచయమున్నవారి ఇళ్లకు వెళుతూ, వారు ఇళ్లకు తాళంవేసి, తాళం చెవి ఎక్కడ పెడుతున్నారో గమనించేవాడు. తర్వాత ఆ ఇళ్ళకు వెళ్లి చోరీ చేసేవాడు. ఇదే టెక్నిక్ ను టెన్నిస్ కోచింగ్ కోసం వచ్చిన ఒక బాలుడి ఇంట్లో కూడా ప్రయోగించి మళ్లీ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. 
 
సర్దార్ పటేల్ నగర్ కు చెందిన ఓ డాక్టరు కుమారుడు టెన్నిస్ నేర్చుకోటానికి రామకృష్ణ పనిచేస్తున్న టెన్నిస్ కోచింగ్ సెంటర్లో చేరాడు. ఈ పరిచయంతో కోచింగ్ పూర్తయ్యాక ఆ బాలుడ్ని రామకృష్ణ ఇంటి దగ్గర దింపేవాడు. ఒకరోజు ఆ బాలుడు మేమంతా ఊరెళుతున్నామని చెప్పాడు. దీంతో ఆ ఇంటిలో దొంగతనానికి ప్లాన్ చేశాడు రామకృష్ణ. 2019, ఏప్రిల్ 25న బాలుడి కుటుంబసభ్యులు యాత్రకు వెళ్లారు. ఆ ఇంటిలో 27వ తేదీ దొంగతనం జరిగింది. ఊరు నుంచి తిరిగి వచ్చిన డాక్టర్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. రెండు రోజుల క్రితం సర్దార్ పటేల్ నగర్లో రామకృష్ణ పోలీసులకు కనపడ్డాడు. అనుమానం వచ్చిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా..డాక్టర్ ఇంట్లో చోరీ చేసిన విషయాన్ని ఒప్పుకున్నాడు. డాక్టర్ కుటుంబం యాత్రకు వెళ్లినప్పుడు బాలుడి వద్ద కొట్టేసిన తాళం చెవితో ఇంట్లోకి ప్రవేశించి విలువైన బంగారం, వెండి నగలు, నగదు  దొంగిలించాడు. నిందితుడి నుంచి సుమారు 5 లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి నగలతో సహా  టీవీ, మిక్సీ, అపాచీ బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు మాదాపూర్ జోన్ డీసీపీ  వెంకటేశ్వరరరావు చెప్పారు.