Britain : పాలన పేరుతో ప్రపంచాన్ని దోచేసిన ఆంగ్లేయులు .. బ్రిటీష్ మ్యూజియంలో మూలుగుతున్న భారత్ అత్యంత విలువైన సంపద
బ్రిటీష్ వలస పాలకులు అత్యధిక సంపద దోచుకున్న దేశాల జాబితాలో భారత్ ముందు వరుసలో నిలుస్తుంది. ఆ సంపద ఇప్పుడు మన చేతిలో ఉంటే ఇండియా రేంజ్ మరోలా ఉండేది. పాలన పేరుతో దశాబ్దాల పాటు భారత్ను దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు బ్రిటీషర్లు. బంగారం, వజ్ర వైడూర్యాలు మొదలుకొని విలువైన సంపదను తమ దేశానికి తరలించుకుపోయారు. బ్రిటీషర్లు దేశాన్ని వదిలి పోయే నాటికి ఇక్కడ ఇంకేమీ మిగల్లేదు..! ఇప్పుడు ఆ సంపదంతా రాజ ప్రసాదాల్లోనూ, బ్రిటీష్ మ్యూజియంలోనూ ఉంది.
Britain : బ్రిటీష్ వలస పాలకులు అత్యధిక సంపద దోచుకున్న దేశాల జాబితాలో భారత్ ముందు వరుసలో నిలుస్తుంది. ఆ సంపద ఇప్పుడు మన చేతిలో ఉంటే ఇండియా రేంజ్ మరోలా ఉండేది. పాలన పేరుతో దశాబ్దాల పాటు భారత్ను దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు బ్రిటీషర్లు. బంగారం, వజ్ర వైడూర్యాలు మొదలుకొని విలువైన సంపదను తమ దేశానికి తరలించుకుపోయారు. బ్రిటీషర్లు దేశాన్ని వదిలి పోయే నాటికి ఇక్కడ ఇంకేమీ మిగల్లేదు..! ఇప్పుడు ఆ సంపదంతా రాజ ప్రసాదాల్లోనూ, బ్రిటీష్ మ్యూజియంలోనూ ఉంది.
దోచుకోవడం దాచుకోవడమే లక్ష్యంగా బ్రిటీషర్ల వలస పాలన సాగింది. ఇది చరిత్ర కాదనలేని సత్యం. రెండు శతాబ్దాల పాటు భారత్ను తెల్లదొరలు దోచుకున్నారు. ఇండియా నుంచి బ్రిటీషర్లు తమ దేశానికి తరలించిన సంపద.. ప్రస్తుత విలువలో దాదాపుగా 45 ట్రిలియన్ డాలర్లకు సమానం. బ్రిటీషర్లు పాలన పేరుతో దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. అంటే ఏ రేంజ్లో దోపిడీ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెల్లదొరల దోపిడి గురించి చెప్పాలంటే 400 ఏళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకోవాలి. ఆనాడు మొఘల్ చక్రవర్తి నూరుద్దీన్ మమహ్మద్ జహంగీర్ పుట్టిన రోజు. మొఘల్ దర్బార్లో తులాభారం జరుగుతోంది.
జహంగీర్ బరువుకు సరిపడే వెండి, బంగారు నాణేలు, ఆభరణాలు, విలువైన వస్తువులు తూకం వేస్తూ పేదలకు పంచిపెడుతున్నారు. ఇదంతా ఓ మూలన నిలబడి చూస్తున్న బ్రిటిష్ రాయబారి సర్ థామస్ రో ఆశ్చర్యపోయాడు. బ్రిట్రిషర్లు ఈస్టిండియా కంపెనీ స్థాపించిన తర్వాత అంతా తారుమారు అయింది. సరిగ్గా 1803లో ఈస్టిండియా కంపెనీ ఇచ్చే భృతిపై మొఘల్ చక్రవర్తి షా ఆలం ఆధారపడాల్సిన వచ్చింది. ఆ స్థాయిలో మన సంపదను బ్రిటీషర్లు దోచుకుపోయారు.
ఔరంగజేబు పాలనాకాలంలో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశం. ప్రపంచ మొత్తం జీడీపీలో పావు వంతు భాగం ఇక్కడిదే. అదే సమయంలో ఇంగ్లండ్ వాటా ప్రపంచ జీడీపీలో కేవలం 2 శాతమే ఉండేది. ప్లాసీ యుద్ధం తర్వాత ఆ ఘనతంతా గతంగా మారిపోయింది. 1947లో భారత్ నుంచి వెళ్లిపోయినపుడు, ఆంగ్లేయులు తమ పడవల నిండా అమూల్యమైన సంపదను నింపుకుని వెళ్తే, ఇండియా చేతులు మాత్రం ఖాళీగా ఉండిపోయాయి. మన దేశం నుంచి బ్రిటీషర్లు ఎత్తుకెళ్లిన విలువైన సంపదలో కోహినూర్ డైమండ్ ఒకటి..! కోహినూర్ డైమండ్.. ఓ దేశ దోపిడీకి సాక్ష్యం..మరో దేశ ఘన వైభవానికి సాక్ష్యం! మన గోల్కొండ సామ్రాజ్యంలో దొరికి.. ఎక్కడెక్కడో తిరిగి.. చివరకు బ్రిటన్ రాణి కిరీటంలో చేరిన ఈ వజ్రంపై ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది.
క్వీన్ ఎలిజబెత్ 2 మరణంతో కోహినూర్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అత్యంత విలువైన ఈ వజ్రాన్ని వెనక్కి ఇచ్చేయాలంటూ… భారత్లో పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. కోహినూర్ తిరిగి తమకు ఇచ్చేయాలంటూ మన దేశం కోరుతుంటే.. మాకివ్వాలంటే మాకివ్వాలంటూ తగువుకు వస్తున్నాయి పాకిస్తాన్, ఇరాన్, అఫ్గానిస్తాన్. వజ్రంపై హక్కులు తమకే ఉన్నాయంటూ వితండవాదం చేస్తున్నాయి. కోహినూర్ వజ్రాన్ని వదులుకోవడానికి ఇంగ్లండ్ ఇష్టపడటం లేదు. ఈ వజ్రాన్ని తాము దోచుకోలేదనీ, హక్కుగా పొందామని వాదిస్తోంది. ప్రస్తుత మార్కెట్లో కోహినూర్ వజ్రం విలువ దాదాపు పదికోట్ల పౌండ్లు.. అంటే మన కరెన్సీలో దాదాపు వెయ్యి కోట్లు ఉంటుంది.
భారత్ను పరిపాలించిన బ్రిటన్ ఇక్కడి నుంచి ఎంతో విలువైన సంపదను తమ దేశానికి దోచుకెళ్లింది. కానీ మనం బ్రిటన్ రాణి కిరీటంలో ఉన్న కోహినూర్ వజ్రం గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. నిజానికి భారతీయ సంస్కృతి, చరిత్రను తెలియజేసే ఎన్నో వెలకట్టలేని కళాఖండాలను మనదేశం నుంచి ఎత్తుకెళ్లారు తెల్లదొరలు. ఇప్పటికీ బ్రిటన్లోని పలు మ్యూజియాల్లో చెక్కు చెదరకుండా ఉన్నాయి. కోహినూర్తో పాటు వీటిని కూడా తిరిగి ఇవ్వాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. మధ్యప్రదేశ్లోని ఖజురహో దేవాలయంలో ఉండే హరిహర విగ్రహం అప్పట్లో అపహరణకు గురైంది. ఎన్నో చేతులు మారి చివరికి లండన్లోని బ్రిటిష్ మ్యూజియానికి చేరింది.
1862లో బిహార్లోని బగల్పూర్ జిల్లా సుల్తాన్గంజ్ ప్రాంతంలో రైల్వే నిర్మాణంలో బయటపడ్డ బుద్ధుడి విగ్రహం బర్మింగ్హామ్ మ్యూజియంలో ఉంది. టిప్పు సుల్తాన్ మరణించగానే ఆయన గదిలో ఉన్న విలువైన వస్తువుల్ని ప్రత్యర్థులు దోచుకెళ్లారు. ఖడ్గం, టిప్పు సుల్తాన్ ఉంగరం, అత్తరు, చెక్కతో చేసిన పులి బొమ్మ ప్రస్తుతం బ్రిటన్లో వేర్వేరు మ్యూజియాల్లో కనిపిస్తాయి. మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి షాజహాన్ మద్యం తాగడానికి ఉపయోగించిన వైట్ నైఫ్రైట్ రాయితో తయారు చేసిన ఓ పాత్ర, చక్రవర్తి మహారాజా రంజిత్ సింగ్ బంగారపు సింహాసనం.. ఇలా అత్యంత అరుదైన, విలువ కట్టలేని వస్తువులు చాలానే కొల్లగొట్టారు.
ప్రస్తుతం 120కిపైగా అరుదైన శిలలపై చెక్కిన శిల్పాలు, శాసనాలు బ్రిటన్ మ్యూజియంలో ఉన్నాయి. వాటిని తిరిగి భారత్కు తీసుకురావడం కోసం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, యూనెస్కో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు వాటితో పాటు కోహినూర్ని ఇండియాకు తీసుకురావాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.