Russia Ukraine War : చర్చల ద్వారానే సమస్య పరిష్కారం- రష్యా, యుక్రెయిన్ల యుద్ధంపై చైనా కీలక ప్రకటన
చర్చల ద్వారానే రష్యా, యుక్రెయిన్లు సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పిన జిన్ పింగ్.. ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా ప్రకటించారు.
Russia Ukraine War : రష్యా, యుక్రెయిన్ల మధ్య యుద్ధంపై ప్రపంచ దేశాలు ఒక్కొక్కటిగా తమ స్పందన తెలుపుతున్నాయి. తక్షణమే హింసకు స్వస్తి పలకాలని, యుక్రెయిన్ పై దాడిని ఆపాలని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ ను కోరిన సంగతి తెలిసిందే. నాటో దేశాలతో పాటు అమెరికా కూడా తన వైఖరిని స్పష్టం చేసింది. తాజాగా ప్రపంచంలో మరో అగ్రదేశంగా పరిగణిస్తున్న చైనా కూడా ఈ యుద్ధంపై స్పందించింది.
రష్యా, యుక్రెయిన్ దేశాలు తమ సమస్యను పరిష్కరించుకునేందుకు చర్చలనే ఆశ్రయించాలని చైనా అభిప్రాయపడింది. ఈ మేరకు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ కీలక ప్రకటన విడుదల చేశారు. చర్చల ద్వారానే రష్యా, యుక్రెయిన్లు సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పిన జిన్ పింగ్.. ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా ప్రకటించారు.
Russia-Ukraine War : యుక్రెయిన్కు రష్యా ఆఫర్.. పోరాటం ఆపి లొంగిపోతే చర్చలకు సిద్ధం!
మరోవైపు.. యుద్ధం జరుగుతున్న వేళ శుక్రవారం నాడు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు ఫోన్ చేశారు. యుక్రెయిన్లో కొనసాగుతున్న సంక్షోభ పరిస్థితులపై పుతిన్తో జిన్ పింగ్ చర్చించినట్లు సమాచారం. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పుతిన్ కు ఆయన సూచించారు.
కాగా, యుక్రెయిన్ పై రష్యా దాడిని దండయాత్ర అని విదేశీ మీడియా అనడాన్ని చైనా తప్పుపట్టిన సంగతి తెలిసిందే. రష్యా దాడిని దండయాత్ర అనడం కరెక్ట్ కాదని కూడా చెప్పింది. యుక్రెయిన్ పై రష్యా దాడికి పరోక్షంగా మద్దతు తెలిపిన డ్రాగన్.. ఇప్పుడు సడన్ గా యుద్ధం వద్దు చర్చలే ముద్దు అని చెప్పడం మంచి పరిణామం అంటున్నారు.
Russia-Ukraine War : యుద్ధం ఆపేయండి.. పుతిన్తో నేరుగా చర్చలకు సిద్ధం.. యుక్రెయిన్ అధ్యక్షుడు
యుక్రెయిన్పై ఇప్పటికే రష్యా భీకర దాడులకు పాల్పడింది. బాంబుల వర్షం కురిపించింది. ఆ దాడులను తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్ కూడా హోరాహోరీగానే పోరాడుతోంది. ఇలాంటి సమయంలో ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు సిద్ధమంటూ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రకటన చేయడం విశేషం.
రష్యా, ఉక్రెయిన్ల మధ్య కొనసాగుతున్న యుద్ధంలో శుక్రవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. యుక్రెయిన్పైకి దండెత్తి వచ్చిన రష్యా రాజీ మంతనాలు మొదలెట్టేసింది. గురువారం ఉదయం నుంచి ఉక్రెయిన్పైకి బాంబులతో విచుకుపడ్డ రష్యా.. రెండో రోజు అయిన శుక్రవారమే చర్చలకు తాము సిద్ధమని ప్రకటించింది. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కార్యాలయం కీలక ప్రకటన విడుదల చేసింది.
యుక్రెయిన్తో చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నట్లుగా రష్యా అధ్యక్ష భవనం ప్రకటించింది. అయితే యుక్రెయిన్ సైన్యం ఆయుధాలు వీడాల్సి ఉంటుందని కండీషన్ పెట్టింది. ఈ కండీషన్కు ఓకే అయితే యుక్రెయిన్తో చర్చలకు తమ బృందాన్ని మిన్స్క్కు పంపుతామని కూడా పుతిన్ కార్యాలయం వెల్లడించింది.