Russia Ukriane War : రష్యాకు ఎదురుదెబ్బ..! 4,300 మంది సైనికులను హతమార్చామన్న యుక్రెయిన్
తమపై యుద్ధానికి దిగిన రష్యా భారీగా మూల్యం చెల్లించుకుంటోందని తెలిపారు. యుక్రెయిన్ సైన్యం.. రష్యాకి చెందిన 4వేల 300 మంది సైనికులను హతమార్చిందని వెల్లడించారు.
Russia Ukraine War : యుక్రెయిన్, రష్యా మధ్య భీకర పోరు నడుస్తోంది. నాలుగో రోజూ (ఫిబ్రవరి 27) యుక్రెయిన్పై బాంబులు, మిస్సైళ్లతో రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. రాజధాని నగరం కీవ్లోకి ప్రవేశించేందుకు రష్యా సైన్యం యత్నిస్తోంది. యుక్రెయిన్ గ్యాస్, చమురు నిక్షేపాలు టార్గెట్ గా రష్యా సేనలు దాడులు చేస్తున్నాయి. కార్కివ్లోని గ్యాస్ పైప్లైన్ను రష్యా బలగాలు పేల్చేశాయి. కాగా, యుక్రెయిన్ సైనికులు తగ్గేదేలే అన్నట్టుగా తమ పోరాట పటిమను చూపిస్తున్నారు. శక్తివంచన లేకుండా రష్యా దళాలను తిప్పికొడుతున్నారు.
తాజాగా యుక్రెయిన్ డిప్యూటీ రక్షణ మంత్రి హన్నా మాల్యర్ సంచలన ప్రకటన చేశారు. తమపై యుద్ధానికి దిగిన రష్యా భారీగా మూల్యం చెల్లించుకుంటోందని తెలిపారు. యుక్రెయిన్ సైన్యం.. రష్యాకి చెందిన 4వేల 300 మంది సైనికులను హతమార్చిందని హన్నా మాల్యార్ వెల్లడించారు. ఇది ధృవీకరించిన సంఖ్య అని కూడా చెప్పారు. అంతేకాదు రష్యాకు చెందిన 146 యుద్ధ ట్యాంకులు, 27 యుద్ధ విమానాలు, 26 హెలికాప్టర్లను యుక్రెయిన్ ఆర్మీ ధ్వంసం చేసినట్లు ఫేస్బుక్ ద్వారా వెల్లడించారు.
Russia Ukraine War : యుక్రెయిన్కు రూ.65 కోట్లు.. జపాన్ కుబేరుడి భారీ విరాళం
యుక్రెయిన్ ను వశపరుచుకోవడమే లక్ష్యంగా పుతిన్ తలపెట్టిన యుద్ధం మరింత ఉగ్రరూపం దాల్చుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. తన రహస్య ఎజెండాతో.. కావాలనే యుక్రెయిన్ పై యుద్ధం ప్రకటించాడని విశ్లేషకులు చెబుతున్నారు. సోవియట్ రాజ్యాన్ని తిరిగి పునర్నిర్మించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ యుద్ధంలో రష్యా సైనికుల ప్రాణాలను పుతిన్ గాల్లో వదిలేశాడంటూ అంతర్జాతీయంగా కథనాలు వెలువడ్డాయి. సుమారు 50వేల మంది రష్యా సైనికుల ప్రాణాలను పణంగా పెట్టి పుతిన్.. వారిని యుద్ధ రంగానికి తోలాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే యుక్రెయిన్ లోకి చొచ్చుకెళ్లిన రష్యా సైనికుల్లో వందలాది మంది మృతి చెందగా.. వేలాది మంది ఆకలిదప్పులతో అలమటిస్తున్నారు.
అదే సమయంలో రష్యాలో హెల్త్ ఎమర్జెన్సీ విధించినట్లు వార్తలు వెలువడ్డాయి. దేశంలో హెల్త్ ఎమర్జెన్సీకి సంబంధించి రష్యా డిప్యూటీ హెల్త్ మినిస్టర్ ఆదేశాలు జారీ చేసినట్లుగా కొన్ని పత్రాలు అంతర్జాతీయ మీడియాకు చిక్కాయి. యుద్ధంలో గాయపడిన సైనికులకు చికిత్స నిమిత్తం రష్యాలోని వైద్యులను, వైద్య సిబ్బందిని తరలించాలని ఆ పత్రాల్లోని ఆదేశాలు స్పష్టం చేసినట్లు ప్రముఖ జర్నలిస్ట్ ఎమ్మా బరోస్ తెలిపారు.
Russia Ukraine War : తగ్గేదే లే…అంటున్న యుక్రెయిన్ ప్రజలు
ఆ పత్రాల ప్రకారం.. “రష్యా ప్రజల ప్రాణాలను, వారి ఆరోగ్యాన్ని కాపాడటం లక్ష్యంగా తక్షణ కార్యకలాపాల్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉండాలని దేశంలోని వైద్య సంస్థలను కోరింది”. ముఖ్యంగా గాయాల నిపుణులు, గుండె సంబంధిత నిపుణులు, మాక్సిల్లో ఫేషియల్, పీడియాట్రిక్ సర్జన్లు, అనస్థీషియా నిపుణులు, రేడియాలజిస్ట్లు, నర్సులు, అంటు వ్యాధి నిపుణులు సైతం అందుబాటులో ఉండాలని రష్యా డిప్యూటీ హెల్త్ మినిస్టర్ ఆదేశించారు.