Amarnath Yatra: జూన్ 30 నుంచి అమర్నాథ్ యాత్ర.. డ్రోన్లతో నిఘా
దాదాపు రెండేళ్ల తర్వాత, జూన్ 30 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గట్టి భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
Amarnath Yatra: దాదాపు రెండేళ్ల తర్వాత, జూన్ 30 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గట్టి భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కేంద్ర హోం శాఖ సెక్రటరీ అజయ్ భల్లా నేతృత్వంలో అమర్నాథ్ యాత్రపై శుక్రవారం సమీక్ష జరిగింది. యాత్ర ఏర్పాట్లు, భక్తుల భద్రతపై చర్చించారు. ఇటీవలి కాలంలో జమ్మూ లోయలో తీవ్రవాద దాడులు ఎక్కువ కావడం, అమర్నాథ్ యాత్రపై తీవ్రవాదులు గురిపెట్టారన్న వార్తల నేపథ్యంలో భక్తుల భద్రత గురించి సమీక్షించారు. ఇప్పటికే ఈ యాత్రకు భద్రత కల్పించే ఉద్దేశంతో, స్థానిక పోలీసులతో కలిసి పనిచేసేలా 120 కంపెనీల బలగాలను కేంద్రం కేటాయించింది. దీంతోపాటు యాత్ర మార్గంలో డ్రోన్లతో కూడా నిఘా ఏర్పాటు చేయనున్నారు.
India: రష్యాపై తీర్మానం.. ఐరాసలో ఓటింగ్కు భారత్ దూరం
భద్రతా కారణాల దృష్ట్యా ఈసారి యాత్రికులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) ఇవ్వనున్నారు. యాత్రికుల భద్రతపై త్వరలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా సమీక్ష నిర్వహించనున్నారు. కోవిడ్ నేపథ్యంలో గత రెండేళ్లుగా అమర్నాథ్ యాత్ర జరగలేదు. దీంతో ఈసారి భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ లోయలో హిందువులపై దాడులు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో అమర్నాథ్ యాత్రకు మరింత భద్రత కల్పించేందుకు కేంద్రం ప్రాధాన్యమిస్తోంది.