Heavy Rains : హైదరాబాద్ లో నేటి మధ్యాహ్నం భారీ వర్షాలు
హైదరాబాద్ లో నేటి మధ్యాహ్నం తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తమయ్యారు.
Heavy rains in Hyderabad : హైదరాబాద్ లో ఇవాళ మధ్యాహ్నం తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు అప్రమత్తమయ్యారు. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వాతావరణ పరిస్థితులను బట్టి పౌరులు తమ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో డీఆర్ఎఫ్ బృందాలు అలర్ట్ అయ్యాయి. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైంది. నగరంలోని పలు కాలనీల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
Rain : తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు
తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. నిన్న హైదరాబాద్లో కుంభవృష్టి కురిసింది. ఆగకుండా కురిసిన వర్షానికి రోడ్లు నీట మునిగాయి. కాలనీలు జలమయమయ్యాయి. నాలాలూ, డ్రైనేజీలు, రహదారులు ఏకమయ్యేసరికి లోతట్టుప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వాన నీరు చేరింది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్పేట్లో రికార్డు స్థాయిలో 13.68 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. కుర్మగూడలో 10 సెంటీమీటర్లు, మహేశ్వరం మండలం పారిశ్రామిక ప్రాంతంలో 9, సౌత్ హస్తినాపురం ప్రాంతంలో 8.83, మలక్పేటలో 8.7, సరూర్నగర్లో 8.6, కంచన్బాగ్లో 8.4, బహదూర్పురాలో 8.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి అల్మాస్గూడ చెరువు కట్ట తెగింది.
Cyclone : ముంచుకొస్తున్న మరో తుపాను ముప్పు
సరూర్నగర్ తపోవన్ కాలనీకి చెందిన 37 ఏళ్ల జగదీశ్.. చింతలకుంట వద్ద నాలాలో పడిపోయాడు. చివరకు తాడు సాయంతో బయటపడ్డాడు. చంపాపేట్లోనూ ఓ వ్యక్తి మ్యాన్హోల్లో పడిపోతే స్థానికులు రక్షించారు. నిన్న రాత్రి దంచికొట్టిన వర్షానికి శంషాబాద్ గగన్పహాడ్లో వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో హైదరాబాద్ నుంచి బెంగళూరు జాతీయ రహదారిపై వాహనాలు మెల్లగా కదులుతున్నాయి.
భారీ వర్షానికి అప్పా చెరువుకు వరద ఉద్ధృతి బాగా పెరిగింది. దీంతో అప్పా చెరువు నుంచి హైవేపైకి వరద నీరు చేరింది. ఆరాంఘర్ టూ శంషాబాద్ వెళ్లే దారిలో సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయ్యింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.