Kumbh Mela : కుంభమేళాలో 1లక్ష నకిలీ కోవిడ్ రిపోర్టులు|
కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోన్న సమయంలో ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో రెండు నెలల క్రితం నిర్వహించిన మహ కుంభమేళా స్నానాలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.
Kumbh Mela కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోన్న సమయంలో ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో రెండు నెలల క్రితం నిర్వహించిన మహ కుంభమేళా స్నానాలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. కుంభమేళా స్నానాల్లో పాల్గొన్న వేల మందికి కోవిడ్ సోకినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే కుంభమేళాలో కరోనా టెస్టుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లుగా తెలుస్తోంది. కరోనా టెస్టుల్లో గోల్మాల్ జరిగినట్లు తాజాగా రిపోర్టులు చెబుతున్నాయి.
హరిద్వారాలో కుంభమేళా జరుగుతున్న సమయంలో సుమారు 4 లక్షల మేర కరోనా టెస్టులు చేయగా అందులో సుమారు ఒక లక్ష వరకు కరోనా ఫేక్ రిపోర్ట్లను ఇచ్చారని ఉత్తరాఖండ్ ప్రాథమిక విచారణలో తేలింది. ఇదంతా ప్రైవేట్ ల్యాబ్ ల పనే అని తేలింది. కుంభమేళా సమయంలో రోజూ 50 వేల కోవిడ్ టెస్టులు చేయాలని ఉత్తరాఖండ్ హైకోర్టు చెప్పడంతో ఆ టార్గెట్ ను రీచ్ అవడానికి ప్రైవేట్ ల్యాబ్ లు.. టెస్టులు చేయకుండానే చేసినట్టు డేటా ఎంటర్ చేశారని తాజాగా గుర్తించారు. ఒకనొక సందర్భంలో ఒకే ఫోన్ నంబర్ను వినియోగించి సుమారు 50 మందికి టెస్టులు నిర్వహించినట్లు గుర్తించారు. అంతేకాకుండా కరోనా టెస్టులు చేసుకున్నవారి సమాచారం పూర్తిగా ఫేక్ అని కూడా తేలింది. హరిద్వార్లోని ఒకే ఇంటి చిరునామాను ఉపయోగించి సుమారు ఐదు వందల మందికి కరోనా టెస్టులను నిర్వహించారు. కరోనా టెస్టుల్లో ఓ ప్రైవేటు ఏజెన్సీ భారీగా అవకతవకలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.
ఈ వ్యవహారంపై ఇప్పుడు ఉత్తరాఖండ్ ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది. ఫేక్ రిపోర్టుల విషయంపై కుంభమేళా హెల్త్ ఆఫీసర్ అర్జున్ సింగ్ సెనగర్ మాట్లాడుతూ… ప్రస్తుతం ఈ విషయంపై విచారణ జరుగుతుంది. టెస్టుల విషయంలో అవకతవకలు జరిగినట్లుగా గుర్తించామన్నారు. 15 రోజుల్లో విచారణ పూర్తి చేసి సమగ్ర నివేదికను అందిస్తామని హెల్త్ సెక్రటరీ అమిత్ నేగి పేర్కొన్నారు. కరోనా టెస్టులపై సమగ్ర విచారణ పూర్తి అయ్యేంత వరకు ప్రైవేటు ఎజెన్సీలకు చెల్లింపులను నిలిపివేయాలని హరిద్వార్ మేజిస్ట్రేట్ కోర్టు తెలిపింది.