Srisailam : ఈ నెల 28 నుంచి శ్రీశైలంకు లాంచీ ప్రయాణం..

పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులకు తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ తీపి కబురు అందించింది. నండికొండ నుంచి శ్రీశైలంకు లాంచీ యాత్రను అందుబాటులోకి తెచ్చింది.

Srisailam : ఈ నెల 28 నుంచి శ్రీశైలంకు లాంచీ ప్రయాణం..

Srisailam

Launch trip to Srisailam : పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులకు తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ తీపి కబురు అందించింది. నందికొండ నుంచి శ్రీశైలంకు లాంచీ యాత్రను అందుబాటులోకి తెచ్చింది. నాగార్జునసాగర్ లో నీటి మట్టం 575 అడుగులకు పైన ఉన్నందున నందికొండ నుంచి శ్రీశైలంకు లాంచీ ప్రయాణం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 28 నుంచి హిల్‌కాలనీ లాంచీ స్టేషన్ నుంచి శ్రీశైలంకు లాంచీ ప్రయాణాలు ప్రారంభిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రెండు రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో జల పాతాల అందాలు, జింకలు, దుప్పుల పరుగులు, నదికి ఇరువైపులా నల్లమల అందాల నడుమ అలలపై లాంచీ ప్రయాణం పర్యాటకులకు అహ్లాదం కల్గిస్తుంది.

ప్రతి శనివారం లాంచీ ప్రయాణం
ప్రతి వారంలో శనివారం ఉదయం ప్రారంభమయ్యే ఈ లాంచీ ప్రయాణం ఆదివారం సాయంత్రం తిరిగి నాగార్జునసాగర్‌కు చేరుకుంటుంది. ఈ రెండు రోజుల ప్రయాణంలో పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా టూరిజం శాఖ లైఫ్ జాకెట్లు, మంచినీటి వసతి, ఆహార ఏర్పాట్లతో పాటు అన్ని రకాల జాగ్రత్తలను తీసుకుంటుంది. అలాగే పర్యాటకులకు శ్రీశైల మల్లన్న దర్శనాన్ని, బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తుంది.

కనువిందు చేసే కమనీయ దృశ్యాలు
నందికొండ నుంచి శ్రీశైలంకు కొనసాగే ఈ రెండు రోజుల ప్రయాణం తీరం వెంబడి ఉన్న అమ్రాబాద్ నల్లమల్ల అడువుల ప్రకృతి సహజ అందాలు పర్యాటకుల మనస్సులను కట్టి పడేస్తాయి. కృష్ణమ్మ సవ్వడుల మధ్య సాగే ఈ ప్రయాణంలో చాకలిగట్టు సమీపించగానే జింకలు, దుప్పులు కనువిందు చేస్తాయి. గౌతమ బుద్దుడి చారిత్రాత్మక విశేషాలను, జీవిత గాథలను తెలిపే నాగార్జునకొండ సమీపంగా సాగుతోంది. కొద్ది దూరం ప్రయాణించాక పురాతన ఏలేశ్వర గట్టు దర్శనమిస్తుంది.

చారిత్రక కోటలు, కొండలు
ఈ లాంచీ ప్రయాణంలో చారిత్రక కోటలు, కొండలు, జలపాతాలు, మొసళ్లు, అందమైన పర్వతాలు ముందుకు వెళ్లే కొద్దీ చూడ ముచ్చటైన అందాలు కనివిందు చేస్తాయి. సాయంత్రానికి లింగాల గట్టు చేరుకుంటుంది. ఆ తర్వాత పర్యాటకులు శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని ఆదివారం సాయంత్రానికి లాంచీలో నందికొండ చేరుకుంటారు.

ప్రయాణ వివరాలు
శ్రీశైలం లాంచీ ప్రయాణాన్ని ఈ నెల 21న ఖరారు చేసినప్పటికీ సరిపడా ప్రయాణికులు లేక పోవడంతో ట్రిప్పును రద్దు చేశారు. తిరిగి మరలా వారంతపు శనివారం 28న శ్రీశైలం లాంచీ ట్రిప్పును ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. లాంచీ ప్రయాణానికి సంబంధించిన వివరాలు, టికెట్ ధరలను అన్‌లైన్‌లో పొందవచ్చునని పేర్కొన్నారు. పర్యాటకుల కోసం హిల్‌కాలనీ లాంచీ స్టేషన్ ఫొన్ నం 7997951023 అందుబాటులో ఉంచారు.