Telangana : ప్రగతి భవన్‌‌కు పీకే ఎందుకు వెళ్లారు ? పొలిటికల్‌ సర్కిల్‌లో హాట్‌ టాపిక్‌

కాంగ్రెస్‌కు జవసత్వాలు నింపుతూనే.. టీఆర్‌ఎస్‌ను మెల్లిగా జాతీయ రాజకీయాల వైపు నడిపించేలా జమిలి వ్యూహాన్ని పీకే ప్లాన్‌ చేశారా..? నేషనల్‌ పాలిటిక్స్‌లో కొత్త పొలిటికల్ జర్నీకి రోడ్‌ మ్యాప్‌ వేస్తున్నారా.. ?

Telangana : ప్రగతి భవన్‌‌కు పీకే ఎందుకు వెళ్లారు ? పొలిటికల్‌ సర్కిల్‌లో హాట్‌ టాపిక్‌

Prasanth Kishor

Updated On : April 24, 2022 / 2:00 PM IST

Prashant Kishor At Pragathi Bhavan : రాజకీయాల్లో ఎవరూ ఊహించని పరిణామం.. ఏ వ్యూహకర్త అంచనా వేయలేని సందర్భం.. తెలంగాణ పాలిటిక్స్‌లోనే కాదు జాతీయ రాజకీయాలనే తన వైపుకు తిప్పుకున్న సమావేశం.. ప్రగతభవన్‌లో పీకే మకాం వేయడం ఇప్పుడు అందరిలోనూ ఒకింత ఆశ్చర్చాన్ని.. మరింత ఆసక్తిని కలిగిస్తోంది. సీఎం కేసీఆర్‌ ఉదయం నుంచి రాత్రి వరకు చర్చించిన పీకే.. ఆదివారం కూడా భేటీ కానున్నారు. అసలింతకీ వాళ్లు ఏం చర్చించారు..? ఏం చర్చిస్తున్నారు..? ఇవాళో రేపో కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటారని వస్తున్న వార్తల సమయంలో.. సడెన్‌గా పీకే ప్రగతిభవన్‌కు ఎందుకు వెళ్లారు..? పీకే పాలిట్రిక్స్‌.. జాతీయ రాజకీయాలను ఏ మలుపు తిప్పనున్నాయి..? తెలంగాణ రాజకీయ చిత్రాన్ని ఏ విధంగా మార్చబోతున్నాయి..? ఇప్పుడు ఈ ఆసక్తికర ప్రశ్నలు అందరిలోనూ తలెత్తుతున్నాయి.

Read More : TPCC : ప్రశాంత్ కిశోర్ చేరికపై రేవంత్ కీలక వ్యాఖ్యలు

హాట్ టాపిక్ గా ప్రశాంత్ కిశోర్ : –
దేశ రాజకీయాల్లో ఇప్పుడు ప్రశాంత్‌ కిశోర్‌ పేరు హాట్‌ టాపిక్‌గా మారింది. ఇండియన్‌ పాలిటిక్స్‌ డయాస్‌ మీద ఆయన పాలిట్రిక్స్‌ ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తిని కలిగిస్తోంది. ఈ పొలిటికల్‌ స్ట్రాటజిస్ట్‌ ప్లాన్స్‌ ఎవరి ఊహకు అందడం లేదు. ఇది జరుగుతుందేమో అనుకునేలోగా ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు పీకే. జాతీయ రాజకీయాలపై ఫోకస్‌ చేసిన కేసీఆర్‌.. పీకేతో దోస్తీని కటీఫ్‌ చేసుకుంటారని ఊహాగానాలు వినిపించాయి. కాంగ్రెస్‌లో చేరే వ్యక్తితో తమ పార్టీ వ్యూహాలను డిస్కస్‌ చేయడం కేసీఆర్‌కు ఇష్టం లేదనే వార్తలు వినిపించాయి. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ప్రశాంత్‌ కిశోర్‌ సడెన్‌గా శనివారం హైదరాబాద్‌ వచ్చారు. సైలెంట్‌గా.. నేరుగా.. ఉదయం తొమ్మిదిన్నరకు ప్రగతిభవన్‌ చేరుకున్నారు. రోజంతా అక్కడే ఉండి కేసీఆర్‌తో చర్చలు జరిపారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ తరఫున పీకే ఐప్యాక్‌ టీమ్‌ పనిచేస్తుంది. అయితే తాజా భేటీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ వ్యూహకర్తగా పనిచేసేందుకు ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. పీకే గీసిచ్చిన ప్లాన్స్‌తో నెక్ట్స్‌ ఎలక్షన్స్‌లో కారు పార్టీ టాప్‌ గేరులో దూసుకుపోతుందని గులాబీ నాయకత్వం భావిస్తోంది. ప్రగతిభవన్‌లో ప్రశాంత్‌ కిశోర్‌ మకాం, ఫెడరల్‌ ఫ్రంట్‌కు శ్రీకారం చుడుతుందనే గుసగుసలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

Read More : Telangana : ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ కామెంట్స్.. 95-105 స్థానాల్లో గెలుపు, ప్రశాంత్ కిశోర్ బెస్ట్ ఫ్రెండ్

టీఆర్ఎస్ పరిస్థితులపై సర్వే : –
కాంగ్రెస్‌ అధిష్ఠానంతో చర్చల కన్నా ముందే.. టీఆర్‌ఎస్‌ కోసం పనిచేసేందుకు ప్రశాంత్‌ కిశోర్‌ అంగీకరించారు. ఇందుకోసం ఆయన ఇప్పటికే ఓసారి రాష్ట్రానికి వచ్చివెళ్లారు. క్షేత్రస్థాయిలో టీఆర్‌ఎస్‌ పరిస్థితులపై సర్వే జరిపి నివేదిక కూడా సమర్పించారు. శనివారం భేటీలో ఫైనల్‌ నివేదికను కేసీఆర్‌కు సమర్పించారని దానిపైనే చర్చ జరిగిందని తెలుస్తోంది. అయితే జాతీయ రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్న కేసీఆర్‌.. పీకేతో ఆ అంశంపై చర్చించారా..? నేషనల్‌ పాలిటిక్స్‌లో కారు స్టీరింగ్‌ తిప్పాలని భావిస్తున్న గులాబీ బాస్‌కి పీకే రోడ్‌ మ్యాప్‌ గీసి ఇస్తున్నారా.. అనేది ఆసక్తిగా మారింది. అయితే కాంగ్రెస్‌తో మిలాఖత్‌ అయిన ప్రశాంత్‌ కిశోర్‌.. టీఆర్‌ఎస్‌ తరఫున ఎలా పని చేయగలుగుతారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Read More : TRS And PK Team : సీఎం కేసీఆర్‌‌తో పని చేయడం లేదన్న ప్రశాంత్ కిశోర్

గులాబీ బాస్ తో భేటీ ఎందుకు ? : –
కొంతకాలంగా జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు కోసం ప్రశాంత్‌ కిశోర్‌ ప్రయత్నాలు చేశారు. ఆ తరువాత కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తానంటూ ఆ పార్టీ హైకమాండ్‌ను సంప్రదించారు. సోనియాగాంధీ, రాహుల్‌తోనూ సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ అనుసరించాల్సిన విధానంపై ప్రజెంటేషన్‌ కూడా ఇచ్చారు. ఇందులో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేయాలని, ఏపీలో మాత్రం వైసీపీతో పొత్తు పెట్టుకోవాలని సూచించినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో కేసీఆర్‌తో ప్రశాంత్‌ కిశోర్‌ భేటీ కావడం ఎవరి ఊహలకు అందడం లేదు. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయాలని కాంగ్రెస్‌ అధిష్టానానికి సూచించిన పీకే.. గులాబీ బాస్‌తో భేటీ ఎందుకు అయ్యారు..? కాంగ్రెస్ కంటే ముందే టీఆర్‌ఎస్‌తో ఉన్న ఒప్పందాన్ని ఏం చేయబోతున్నారు..?

Read More : CM KCR: సీఎం కేసీఆర్ ఎన్నికల వ్యూహం.. రంగంలోకి ప్రశాంత్ కిశోర్!

అనేక సందేహాలు.. ప్రశ్నలు : –
అయితే టీఆర్‌ఎస్‌తో తెగతెంపులు చేసుకునేందుకే పీకే హైదరాబాద్‌ వచ్చారనే అనుమానాలు వస్తున్నాయి. కానీ దోస్తీ కటీఫ్‌ చేసుకునేందుకు రెండ్రోజులు ప్రగతిభవన్‌లోనే మకాం వేసే అవసరం ఉండదు కదా అనే సందేహం కూడా కలుగుతోంది. కాంగ్రెస్‌కు జవసత్వాలు నింపుతూనే.. టీఆర్‌ఎస్‌ను మెల్లిగా జాతీయ రాజకీయాల వైపు నడిపించేలా జమిలి వ్యూహాన్ని పీకే ప్లాన్‌ చేశారా..? కారు స్టీరింగ్‌ను కాంగ్రెస్‌ హస్తానికి అందించి.. నేషనల్‌ పాలిటిక్స్‌లో కొత్త పొలిటికల్ జర్నీకి రోడ్‌ మ్యాప్‌ వేస్తున్నారా.. ఇదే జరిగితే తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు.. ప్రగతిభవన్‌తో మైత్రికి ఒప్పుకుంటారా..? ఇదంతా కాకుండా.. జాతీయ స్థాయిలో పొత్తు.. రాష్ట్ర స్థాయిలో పోరాటం అనే కొత్త పద్దతి తెరమీదకు తీసుకొస్తారా..? ఈ ఊహాతీత భేటీ అనేక సందేహాలు, ప్రశ్నలను రాజకీయ వేదిక ముందుకు తీసుకొచ్చింది. రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.