Zycov-D : భారత్ లో పిల్లల కోసం మొట్టమొదటి కోవిడ్ వ్యాక్సిన్
దేశంలో పిల్లల కోసం మొట్టమొదటి కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. జైడస్ క్యాడిలా తయారుచేసిన కరోనా టీకా జైకోవ్-డీకి అనుమతి లభించింది.
Zycov-D : దేశంలో పిల్లల కోసం మొట్టమొదటి కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. జైడస్ క్యాడిలా తయారుచేసిన కరోనా టీకా జైకోవ్-డీ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతినిచ్చింది. 12 ఏళ్ళు నిండినవారికి జైకోవ్-డీ టీకాను వేయవచ్చని సంస్థ స్పష్టం చేసింది.
ప్రపంచంలో మొదటి డీఎన్ఏ ఆధారిత కరోనా వ్యాక్సిన్ జైకోవ్-డీ అని సంస్థ తెలిపింది. కాగా గుజరాత్కు చెందిన ఫార్మా సంస్థ జైడస్ క్యాడిలా సొంతంగా ఈ టీకాను అభివృద్ధి చేసింది. ఏడాదికి 10 నుంచి 12 కోట్ల డోసులు ఉత్పత్తి చేయనున్నట్టు వెల్లడించింది.
కాగా మూడో దశలో 28 వేలమందిపై క్లినికల్ ట్రయల్స్ జరపగా వైరస్ పై 66.6 శాతం సామర్థ్యంతో పనిచేసినట్లు సంస్థ తెలిపింది. ఈ టీకా సూది లేకుండా ఫార్మాజెట్ అనే పరికరం సాయంతో వేస్తారు. ఇక ఇప్పటివరకు దేశంలో 18 ఏళ్ళు పైబడిన వారికి ఇచ్చే టీకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. జైకోవ్-డీ మాత్రం 12ఏళ్లు నిండినవారికి కూడా వేయవచ్చు.
మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతుంది. శుక్రవారం నాటికి 58 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. శుక్రవారం ఒక్కరోజే 33 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.