భారత్ అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం, కాసేపట్లో ల్యాండ్ కానున్న రాఫెల్

  • Published By: naveen ,Published On : July 29, 2020 / 12:41 PM IST
భారత్ అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం, కాసేపట్లో ల్యాండ్ కానున్న రాఫెల్

భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం చేరనుంది. అదే రాఫెల్ యుద్ధ విమానం. అధునాత రాఫెల్ విమానాలు కొన్ని గంటల వ్యవధిలో భారత్ లో కాలు మోపబోతున్నాయి. ఈ నేపధ్యంలో రాఫెల్ విమానాలు ల్యాండ్ కానున్న అంబాలాలో భారీగా ఆంక్షలు విధించారు. అంబాలా ఎయిర్ బేస్ పాకిస్తాన్ బోర్డర్ కు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది.

7వేల కిలోమీటర్లు ప్రయాణించి భారత్ కు:
ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధవిమానాలు కాసేపట్లో ఇండియాకు చేరుకోనున్నాయి. తొలి విడతలో భాగంగా ఐదు రాఫెల్ యుద్ధవిమానాలు సోమవారం(జూలై 27,2020) ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన సంగతి తెలిసిందే. మార్గమధ్యంలో భూమికి 30వేల అడుగుల ఎత్తులో ఆకాశంలోనే రాఫెల్ విమానాలు ఇంధనం నింపుకోవడం విశేషం. రాఫెల్ మొదటి బ్యాచ్ ఫ్రాన్స్ నుండి బయలుదేరి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అల్ దఫ్రా ఎయిర్ బేస్ మీదుగా భారత్ లోని అంబాలా ఎయిర్ బేస్ కు చేరుకోనున్నాయి. అల్ దఫ్రాలో ఫ్రెంచ్ ఎయిర్ బేస్ ఉంది. దాదాపు 7వేల 364 కిలోమీటర్ల ప్రయాణం అనంతరం ఇవాళ(జూలై 29,2020) హర్యానాలోని అంబాలాకు చేరుకోనున్నాయి. తొలిదశలో రానున్న 5 రాఫెల్ ఫైట్ జెట్స్ లో రెండు శిక్షణ, మూడు యుద్ధ విమానాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఫొటోలు, వీడియోలు నిషేధం.. అంబాలాలో ఆంక్షలు:
బుధవారం నాడు అంబాలాకు రాఫెల్ చేరుకోనున్న నేపధ్యంలో అక్కడ నో ఫ్లై జోన్ ప్రకటించారు. అంతేకాకుండా చుట్టుపక్కల 4 గ్రామాల్లో సెక్షన్ 144 విధించారు. జనం గుమిగూడకుండా… ఇళ్ల మిద్దెలపైకెక్కి ఫోటోలు తీయడం, వీడియో తీయడాన్ని సైతం పూర్తిగా నిషేధించారు. భారత వాయుసేనను మరింత బలోపేతం చేసేందుకు మొత్తం 59వేల కోట్లతో 36 రాఫెల్ విమానాలు అందించేలా ఫ్రాన్స్ తో భారతదేశం 2016 సెప్టెంబర్ 23న ఒప్పందం చేసుకుంది. దసాల్ట్‌ సంస్థ అత్యాధునిక రాఫెల్‌ యుద్ధ విమానాల‌ను తయారు చేసింది. ఈ యుద్ధ విమానాలను ఇప్పటివరకూ ఫ్రాన్స్‌, ఈజిప్ట్‌, ఖతర్‌ దేశాలు మాత్రమే కలిగి ఉన్నాయి. రాఫెల్ యుద్ధవిమానాల రాకతో భారతదేశ వాయుసేన మరింత శక్తివంతం కావడం ఖాయం.

రాఫెల్ కు ఘనస్వాగతం:
ఫ్రాన్స్ నుండి వస్తున్న ఫైటర్ జెట్ రాఫెల్‌కు ఘనస్వాగతం పలికేందుకు భారత్ ఎయిర్ ఫోర్స్ సిద్దమైంది. తొలి దఫా రాఫెల్ యుద్ధ విమానాలకు వైమానిక దళానికి చెందిన ఎయిర్ చీఫ్ బదౌరియా ఘన స్వాగతం పలకనున్నారు. రాఫెల్ యుద్ధ విమానాలతో పాటు A330 Phoenix MRTT రీ ఫ్యూయలింగ్ ప్లేన్లు కూడా వస్తున్నాయి. ఆ ప్లేన్స్ లో ఒక దానిలో 70 వెంటిలేటర్లు, లక్ష టెస్టు కిస్టులు, 10మందితో కూడిన వైద్య నిపుణుల బృందం కూడా ఉంది. కరోనా వైరస్ నేపథ్యంలో ముందుజాగ్రత్తగా వైద్య నిపుణుల బృందాన్ని కూడా పంపారు.

రాఫెల్‌తో భారత వైమానిక దళం రెట్టింపు, శత్రుదేశాల గుండెల్లో వణుకు:
రాఫెల్ యుద్ధ విమానాల సరఫరా ప్రక్రియ అధికారికంగా 2019 అక్టోబర్ లోనే ప్రారంభమైంది. ఫ్రాన్స్ లో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటించారు. ఆ సమయంలోనే రాఫెల్ విమానాలు మన ఎయిర్ ఫోర్స్ కు అప్పగించారు. అయితే పైలెట్లకు శిక్షణ ఇచ్చేందుకు, మెకానిక్స్ కోసం ఆ విమానాలను ఫ్రాన్స్ లోనే ఉంచారు. 2022 నాటికి అన్ని రాఫెల్ యుద్ధ విమానాలను భారత్ కు ఇవ్వనుంది ఫ్రాన్స్. చైనా, పాకిస్తాన్ తో ఉద్రిక్తల తరుణంలో రాఫెల్ యుద్ధ విమానాలు భారత వాయు శక్తిని గణనీయంగా పెంచుతాయని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.

17వ స్వ్కాడ్రన్ గోల్డెన్ యారోస్ కు అప్పగింత:
మూడు సింగిల్ సీటర్లు మరియు రెండు ట్విన్ సీటర్ తో కూడిన ఈ జెట్ ఫైటర్ ను ఐఎఎఫ్‌లో 17వ స్క్వాడ్రన్‌ కు (దీన్నే ‘గోల్డెన్ బాణాలు’ అని కూడా పిలుస్తారు) అప్పగిస్తారు. 17వ గోల్డెన్ ఆరోస్ కమాండింగ్ ఆఫీసర్ పైలట్లతో విమానాలను తీసుకొస్తున్నారు. ఇప్పటికే పైలట్లు ఫ్రెంచ్ దసాల్ట్ ఏవియేషన్ కంపెనీలో పూర్తి స్థాయి శిక్షణ పొందారు. ఐదవ తరం ఫైటర్ జెట్ పోరాట సామర్థ్యాన్ని ఎదుర్కోవడానికి వీలుగా వీరు రాటుదేలారు. రాఫెల్ రాకతో భారత వైమానిక దళం బలం రెట్టింపు కానుంది.

అంబాలా ఎయిర్ బేస్ లో రెండు స్వ్కాడ్రన్ లు ఉన్నాయి. ఒకటి జాగ్వార్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, మరొకటి MIG-21 Bison. 2019లో పాకిస్తాన్ భూభాగంలోని బాలాకోట్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన దాడులు చేసింది. ఆ దాడులకు మిరాజ్ ఫైటర్లను వాడిన సంగతి తెలిసిందే. ఆ ఫైటర్లు అంబాలా ఎయిర్ బేస్ కు చెందిన వారే.