కరోనా సెకండ్ వేవ్‌ : దేశవ్యాప్తంగా కొత్తగా 62,258 కేసులు

భారత్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రాలు లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలు విధించినా ఫలితం కనిపించడం లేదు.

కరోనా సెకండ్ వేవ్‌ : దేశవ్యాప్తంగా కొత్తగా 62,258 కేసులు

62258 New Corona Cases Registered In India

new corona cases in india : భారత్‌లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రాలు లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలు విధించినా ఫలితం కనిపించడం లేదు. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యే దీనికి అద్దం పడుతోంది.. గతేడాది అక్టోబర్ 16 తర్వాత దేశంలో తొలిసారి కరోనా కేసుల సంఖ్య 62 వేలు దాటింది.. అదే సమయంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4 లక్షల 53 వేలకు చేరువ కావడం మరోసారి కంగారు పెట్టిస్తోంది.

దేశంలో కరోనా రికవరీ రేటు 95 శాతం కంటే ఎక్కువగానే ఉన్నా… కొత్త కేసులు కూడా అదే స్థాయిలో నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కేసులు నమోదవుతున్న దేశాల్లో ప్రస్తుతం భారత్ మూడో స్థానంలో ఉంది. మహారాష్ట్ర, పంజాబ్, మధ్య ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక , కేరళ, ఢిల్లీలో కేసుల పెరుగుదల ఎక్కువగా ఉంది.

దేశంలో నమోదయ్యే కేసుల్లో సగం కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి.. ఒక్కరోజే దాదాపు 37 వేలకు పైగా కేసులు నమోదవ్వడంతో.. మహారాష్ట్ర సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని సీఎం ఉద్దవ్‌ థాక్రే నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు నైట్‌కర్ఫ్యూ, వీకెండ్‌ లాక్‌డౌన్‌లు విధించడం వల్ల కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి ఆగదంటూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు… కర్ఫ్యూలు, లాక్‌డౌన్‌ వల్ల వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ నెమ్మదించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. వ్యాక్సినేషన్‌ను పెంచడం వల్లే కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వ్యాప్తిని కట్టడి చేయొచ్చని వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విజృంభిస్తోంది. ఏపీలో కూడా కేసుల నమోదు సంఖ్య వెయ్యికి చేరువలో ఉంది.. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనే 55 కేసులు బయటపడ్డాయి. కృష్ణా, గుంటూరు, చిత్తూరు, విశాఖల్లో వందకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇటు తెలంగాణలోనూ వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కేసుల సంఖ్య భారీగా లేకపోయినా.. రోజురోజుకు వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది..

కరోనా కేసులు పెరుగుతుండటంతో హోలీ సంబరాలపై వివిధ రాష్ట్రాలు నిషేధం విధిస్తున్నాయి.. ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం హోలీ వేడుకలపై నిషేధం విధించింది..ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్, హర్యానాలు ఆంక్షలు విధించాయి..ఇటు తెలంగాణలోనూ హోలీ పండగపై కరోనా ఎఫెక్ట్ పడింది. హోలీ సందర్భంగా సైబరాబాద్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. హోలీ ఈవెంట్లకు అనుమతి లేదని చెప్పారు.

తెలంగాణలో వ్యాక్సినేషన్‌ విషయంలో ప్రజల నుంచి స్పందన తక్కువగా ఉందన్నారు డీహెచ్‌ శ్రీనివాసరావు.. ఏప్రిల్‌ 1 నుంచి 45 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్‌ ఇవ్వబోతున్నామని తెలిపారు. కరోనా సోకిన పెషెంట్ల కోసం 10 వేల ఆక్సిజన్‌ పడకలు సిద్ధంగా ఉన్నాయని డీఎంఈ రమేష్ రెడ్డి ఉన్నారు. కరోనా ఒకసారి వస్తే.. జీవితాంతం ఇబ్బంది పడాల్సిందేనంటున్నారు వైద్య నిపుణులు.

కరోనా సోకిన వ్యక్తులను గతేడాది నుంచి పరిశీలిస్తే.. ఊపిరితిత్తులకు సంబంధించిన అనేక రకాలైన సమస్యలను ఎదుర్కొంటున్నట్లు గుర్తించామని డీఎంఈ రమేష్‌ రెడ్డి తెలిపారు. అందువల్ల వైరస్ అటాక్‌ కాకుండా చూసుకోవడమే ఉత్తమమని సూచించారు. ఏదేమైనా దేశంలో కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది.. రాష్ట్రాలు లాక్‌డౌన్‌, కర్ఫ్యూల వైపు దృష్టి సారిస్తుండగా.. కేంద్రం మాత్రం వ్యాక్సినేషన్‌ను మరింత పెంచాలన్న ఆలోచనలో ఉంది.