Vandalur Zoo : కరోనాతో మరో సింహం మృతి
తమిళనాడు రాజధాని చెన్నై శివార్లలోని అరైనర్ అన్నా జూలాజికల్ పార్కు(వాండలూర్ జూ)లో కరోనా బారినపడి మరో సింహం మృతిచెందింది.
Vandalur Zoo తమిళనాడు రాజధాని చెన్నై శివార్లలోని అరైనర్ అన్నా జూలాజికల్ పార్కు(వాండలూర్ జూ)లో కరోనా బారినపడి మరో సింహం మృతిచెందింది. ఏసియాటిక్ మగ సింహం పద్మనాథన్ (12) బుధవారం ఉదయం 10:15 గంటల సమయంలో మరణించినట్లు జూ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. జూన్-3న ఈ సింహం శాంపిల్స్ ను భోపాల్ లోని ఎన్ఐహెచ్ఎస్ఏడీకి టెస్ట్ కోసం పంపిచంగా రిపోర్ట్ లో వైరస్ సోకినట్లు తేలిందని,దీంతోఆ మృగరాజుకు అప్పటినుంచి అత్యవసర విభాగంలో ఉంచి ట్రీట్మెంట్ అందించినట్లు పేర్కొన్నారు. అయితే పరిస్థితి విషమించి ఇవాళ ఉదయం కన్నుమూసిందని తెలిపారు.
దీంతో అరైనర్ అన్నా జూలాజికల్ పార్కులో కరోనా కారణంగా మృతిచెందిన సింహాల సంఖ్య రెండుకు చేరినట్లు జూ అధికారులు తెలిపారు. ఈ నెల 3న జూలోని నీలా (9) అనే ఆడ సింహం కరోనాతో మృతిచెందిన విషయం తెలిసిందే. అదేరోజు మిగతా సింహాలకు కూడా పరీక్షలు నిర్వహించగా మొత్తం తొమ్మిది సింహాలకు కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి తమిళనాడు వెటర్నరీ అండ్ ఎనిమల్ సైన్సెస్ యూనివర్శిటీకి చెందిన సీనియర్ వైద్యులు వాటికి ప్రత్యేకంగా చికిత్స అందజేస్తున్నారు. వాటిలో మూడు సింహాలు చికిత్సకు నిదానంగా స్పందిస్తున్నాయని జూ అధికారులు తెలిపారు.