భారత్ను వెంటాడుతోన్న బర్డ్ ఫ్లూ : తొమ్మిది రాష్ట్రాలకు పాకిన వైరస్
Bird flu spread to nine states in india : బర్డ్ ఫ్లూ పీడ భారత్ను వెంటాడుతోంది. నిన్నటి దాకా ఏడు రాష్ట్రాలకే పరిమితమైన బర్డ్ ఫ్లూ తాజాగా మహారాష్ట్రతో పాటు ఢిల్లీలోకి ఏంట్రీ ఇచ్చింది. మహారాష్ట్రాలోని పర్బణీ జిల్లా మురుంబా పౌల్ట్రీఫారంలో సుమారు 800 కోళ్లు మృతి చెందాయి. దీంతో ఈ కోళ్ల శాంపిల్స్ను ల్యాబ్కు పంపించారు. రిపోర్టులో ఆ కోళ్లు బర్డ్ ఫ్లూ కారణంగానే మృతి చెందినట్లు తేలింది.
దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మురుంబా గ్రామానికి ఒక కిలోమీటరు పరిధిలో ఉన్న ఫారాల్లోని అన్ని కోళ్లను చంపేయాలని అధికారులు ఆదేశించారు. గ్రామానికి 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న కోళ్లను ఇతర జిల్లాలకు తరలించకూడదని కూడా ఆదేశించారు.
మురుంబా గ్రామంలోని అతిపెద్ద పౌల్ట్రీ ఫారంలో 8 వేల కోళ్లు ఉండగా, వారిలో 800 కోళ్లు బర్డ్ ఫ్లూ కారణంగా మృతి చెందాయి. దేశంలో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పడుతున్న సమయంలో బర్డ్ ఫ్లూ అత్యంత వేగంగా వ్యాప్తి చెందడం కలవరపాటుకు గురి చేస్తోంది. ఇప్పటివరకూ కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ప్రదేశ్, హరియాణా, యూపీ, గుజరాత్లలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు అయ్యాయి.
ఇప్పుడు దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్రలోకి బర్డ్ ఫ్లూ ప్రవేశించింది. మరోవైపు ఢిల్లీలోకి కూడా బర్డ్ ఫ్లూ ఎంట్రీ ఇచ్చినట్లు రిపోర్టులు వచ్చాయి. నిన్న మృతి చెందిన కోళ్ల నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించగా రిపోర్టులో బర్డ్ ఫ్లూ అని తేలింది.