దశల వారీగా రైళ్లు, విమానాలు ?

  • Published By: chvmurthy ,Published On : April 5, 2020 / 04:42 AM IST
దశల వారీగా రైళ్లు, విమానాలు ?

దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ అమలవుతున్నందున ఆ తర్వాత  రైళ్లు నడపటంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించి  సగం రోజులు పూర్తయ్యింది. ఏప్రిల్‌ 15వ తేదీ తర్వాత లాక్‌డౌన్‌ను దశల వారీగా సడలిస్తామని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రైలు, విమానయాన సంస్థలు సంకేతాలిస్తున్నాయి. 

ఏప్రిల్‌ 14న లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే రైళ్లను నడిపేందుకు రైల్వే జోనల్‌ ఆఫీస్‌లు సిద్ధమవుతున్న వేళ ఈ ప్రకటన వచ్చింది. లాక్‌డౌన్‌ పర్యవేక్షణకు ఏర్పాటైన మంత్రుల బృందం అనుమతి  ఇచ్చాకే  రైలు సర్వీసుల పునరుద్ధరణ ఉంటుందన్నారు. దేశంలోని 17 రైల్వేజోన్లలో అందుబాటులో ఉన్న బోగీల ఆధారంగా ఎలాంటి సర్వీసుల్ని ముందుగా పునరుద్ధరించాలన్న అంశంపై సమాలోచనలు జరుగుతున్నాయి.

ఒకవేళ సర్వీసులను పునరుద్ధరించినా ప్రయాణికులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహించే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి.     ‘రైల్వే బోర్డు ఒక్కో రైలుకు నిర్దిష్టంగా అనుమతి ఇచ్చాకే సర్వీసుల్ని నడుపుతామని  రైల్వే అధికారులు తెలిపారు.  దశలవారీగా రైల్వే సర్వీసులను ఎలా పునరుద్ధరించాలన్న అంశంపై రైల్వే బోర్డుకు సూచనలిచ్చాం’ అని అధికారులు తెలిపారు. 

మరో వైపు విమానాల బుకింగ్‌లు ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఎయిర్‌ ఆసియా ఇండియా సంస్థ ప్రకటించింది. అయితే, డీజీసీఏ మార్గదర్శకాలను బట్టి ఇందులో మార్పులు ఉండవచ్చని తెలిపింది. ఏప్రిల్‌ 15 నుంచి తమ కార్యకలాపాలను పున:ప్రారంభిస్తామని పలు విమానయాన సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి.

దేశీయ విమాన సర్వీసులకు గాను ఏప్రిల్‌ 15 నుంచి బుకింగ్‌లు ప్రారంభించనున్నట్లు ఇండిగో, స్పైస్‌జెట్, గోఎయిర్‌ సంస్థలు ప్రకటించాయి. అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణానికి మే 1 నుంచి టిక్కెట్లు విక్రయిస్తామని స్పైస్‌జెట్, గోఎయిర్‌ స్పష్టం చేశాయి. ప్రజలు సహకరించే విధానాన్ని బట్టి లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ ముగిశాక ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలన్న అంశంపై  యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తన అధికారులతో చర్చించారు.