Harsh Vardhan : కోవిడ్ సెకండ్ వేవ్ ఇంకా ముగిసిపోలేదు
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలు కొవిడ్ ఆంక్షలను సడలిస్తున్న క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్థన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Harsh Vardhan కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలు కొవిడ్ ఆంక్షలను సడలిస్తున్న క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్థన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ సెకండ్ వేవ్ ఇంకా ముగిసిపోలేదని హర్ష్ వర్థన్ తెలిపారు. దేశరాజధానిలో డెంగ్యూ,మలేరియా,చికెన్ గున్యా వంటి వెక్టార్ బోర్న్ డాసీజెస్(పరాన్నజీవులు,వైరస్ లు,బాక్టీరియాల కారణంగా వచ్చే అనారోగ్యాలు)కట్టడి సంసిద్ధతపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్లతో మంగళవారం ఏర్పాటు చేసిన వర్చువల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న హర్ష్ వర్థన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కేసుల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ కొవిడ్ నిబంధనలు పాటించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని హర్ష్ వర్థన్ తెలిపారు.కరోనాపై ఒకటిన్నరేళ్లుగా మనకున్న అనుభవం ఇదే విషయాన్ని స్పష్టంచేస్తుందన్నారు. ఈ సమయంలో మనం మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. అదృష్టవశాత్తు ఆరు నెలలుగా వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉందని, ఈ సమయంలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వ్యాక్సిన్ తీసుకోవడంవల్ల త్వరలోనే మహమ్మారి మీద విజయం సాధించవచ్చని హర్ష్ వర్థన్ ఆశాభావం వ్యక్తంచేశారు.