ఓ వైపు ఎముకలు కొరికే చలి..అయినా..కదం తొక్కుతున్న అన్నదాతలు

  • Published By: madhu ,Published On : November 30, 2020 / 08:33 PM IST
ఓ వైపు ఎముకలు కొరికే చలి..అయినా..కదం తొక్కుతున్న అన్నదాతలు

farmers’ protest

Farmers’ concern in Delhi : దేశ రాజధాని ఢిల్లీ దద్దరిల్లుతోంది..! రైతు దండయాత్రతో ఉక్కిరిబిక్కిరవుతోంది..! ఓవైపు పోలీసుల నిర్బంధం…మరోవైపు ఎముకలు కొరికే చలి… దేన్నీ లెక్క చేయకుండా… ఢిల్లీ గల్లీల్లో అన్నదాతలు కదంతొక్కుతున్నారు. మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న అన్నదాతలు… తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఢిల్లీని వదిలేది లేదంటూ భీష్మించుకున్నారు.



ఉద్రిక్తతలు :-
ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన ఐదో రోజుకు చేరింది. సింఘు సరిహద్దులకు రైతులు భారీగా తరలివస్తున్నారు. ఐదు రోజులుగా అక్కడే బసచేస్తున్న రైతులు ఆందోళన ఉధృతం చేశారు. 44వ నెంబరు జాతీయ రహదారి అన్నదాతల ఆందోళనతో ప్రతిధ్వనిస్తోంది. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని, తమను ఢిల్లీలోకి అనుమతించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిరంకారీ మైదానానికి తాము వెళ్లబోమని రైతులు తేల్చిచెప్పారు. జంతర్‌ మంతర్‌లోకానీ, రామ్‌లీలా మైదానంలో కానీ ఆందోళన జరిపేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. ఢిల్లీలోకి ప్రవేశించేందుకు రైతులు ప్రయత్నిస్తుండడంతో సింఘు, టిక్రి, ఘజియాబాద్ సరిహద్దులను ఢిల్లీ పోలీసులు మూసివేశారు. సింఘు సరిహద్దుల్లో భారీగా కేంద్ర బలగాలు మోహరించారు. బారికేడ్లు, సిమెంటు దిమ్మలు, ఇనుప కంచెలు, వాటర్
కెనాన్లతో రైతులను అడ్డుకుంటున్నారు. 44వ నెంబరు జాతీయ రహదారిపై 10 కిలోమీటర్ల మేర ట్రాక్టర్లు నిలిచిపోయాయి.



రాజకీయాలకు అతీతంగా :-
ఢిల్లీలోకి ప్రవేశించేందుకు రైతులు ప్రయత్నిస్తుండడంతో సింఘు, టిక్రి, ఘజియాబాద్ సరిహద్దులను ఢిల్లీ పోలీసులు మూసివేశారు. సెంట్రల్‌ ఢిల్లీలో నిరసన తెలిపేందుకు అనుమతివ్వాలంటూ ఢిల్లీ హర్యానా సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతులు నిరంకారి మైదానానికి వెళ్ళేందుకు నిరాకరిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా రైతుల ఆందోళన సాగుతోంది. రైతు నిరసన వేదికలపై రాజకీయ నాయకులకు అనుమతి లేదంటున్నారు రైతులు. తమకు మద్దతు తెలిపే సంఘాల నాయకులకు మాత్రమే మాట్లాడే అవకాశం కల్పిస్తామన్నారు.



ఐదు రాష్ట్రాలు :-
పంజాబ్, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ నుంచి వేలాదిగా రైతులు ఢిల్లీ సరిహద్దులకు తరలివస్తున్నారు. ఆందోళనకు బురారీలోని నిరంకారీ మైదానం కేటాయించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సెంట్రల్ ఢిల్లీ పార్లమెంట్, జంతర్ మంతర్, రామ్ లీలా మైదానంలో ఆందోళన చేస్తామంటున్నారు రైతులు. ఐదు రోజులుగా అనేకమంది రైతులు సరిహద్దుల్లోనే బసచేస్తున్నారు. నిరంకారి మైదానాన్ని బహిరంగ జైలుగా మార్చారని రైతులు ఆరోపిస్తున్నారు. కార్పోరేట్ కంపెనీలకు అనుకూలంగా ఉన్న చట్టాలను మార్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. కనీస మద్దతు ధర, పంటల కొనుగోలుపై ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలని, ఎలక్ట్రిసిటీ ఆర్డినెన్స్‌ను నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.



మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చర్చలు :-
మరోవైపు రైతుల ఆందోళనపై వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్ స్పందించారు. భారత ప్రభుత్వం రైతులతో ఇప్పటికే మూడు దఫాలుగా చర్చలు జరిపిందని, డిసెంబర్‌ 3న నాలుగో విడత చర్చలు జరపాల్సి ఉందన్నారు. అయితే రైతుల నుంచి వస్తున్న ఒత్తిడితో డిసెంబర్‌ 1న మరోసారి ప్రభుత్వం రైతులతో చర్చించే అవకాశం ఉంది.