నేడు భారత్ కు బోయింగ్ 777…ఇకపై వీవీఐపీల ప్రయాణాలు అందులోనే
First modified Boeing 777 aircraft రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రుల ప్రయాణాల కోసం కొనుగోలు చేసిన ప్రత్యేక బోయింగ్ 777 విమానం గురువారం భారత్ చేరనుంది. ఎయిర్ ఇండియా-1 గా పిలిచే ఈ విమానం టెక్సాస్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి ఈ రోజు మధ్యాహ్నం చేరుకుంటుందని అధికారులు తెలిపారు
అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ నుంచి ఈ విమానాన్ని భారత్ కొనుగోలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ విమానంలో అధునాతన భద్రతా పరికరాలను అమర్చారు. వీవీఐపీల కోసం వినియోగించే మరో బీ777 విమాన త్వరలోనే భారత్ చేరుతుందని అధికారులు తెలిపారు. ఈ రెండు విమానాలను ముందుగా ఈ ఏడాది జులైలోనే అందించాల్సి ఉన్నప్పటికీ.. కరోనా మహమ్మారి కారణంగా కొన్ని నెలలు వాయిదా పడినట్లు చెప్పారు.
ప్రముఖుల ప్రయాణాల్లో ఈ రెండు బీ777 విమానాలను ఎయిర్ ఇండియా పైలట్లు కాకుండా వాయుసేన పైలట్లు నడుపుతారని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రులు.. ఎయిర్ ఇండియాకు చెందిన బీ747 విమానంలో ప్రయాణం చేస్తున్నారు. వీటిని ఎయిర్ ఇండియా పైలట్లు ఆపరేట్ చేస్తున్నారు. బీ777 విమానాలు అందుబాటులోకి వచ్చాక బీ747లను ఎయిర్ ఇండియాలో కమర్షియల్ ఆపరేషన్స్ కోసం వినియోగించనున్నారు.
కొత్త విమానాలను 2018లో కొన్ని నెలల పాటు ఎయిర్ ఇండియాలో వినియోగించారు. తర్వాత వీవీఐపీల ప్రయాణాల కోసం ఆధునిక భద్రత పరికరాలు బిగించేందుకు బోయింగ్ సంస్థకు పంపించారు. ఇందులో క్షిపణి రక్షణ వ్యవస్థ…ఎల్ఏఐఆర్సీఎం, వ్యక్తిగత రక్షణ సూట్స్ ఉన్నాయి.