అమెరికాను దాటేస్తాం : అక్టోబర్ మొదటి వారానికల్లా భారత్ లో 70లక్షల కరోనా కేసులు!
ప్రస్తుతం ప్రపంచంలో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ 2వ స్థానంలో ఉన్న విషయం తేలిసిందే. మొదటి స్టానంలో అమెరికా కొనసాగుతోంది. ప్రస్తుతం అమెరికాలో 65 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. భారత్లో కేసులు 46 లక్షలకు చేరువలో ఉన్నాయి
అయితే, భారతదేశంలో కరోనా విజృంభణ ఇలాగే కొనసాగితే వచ్చే నెల మొదటి వారానికల్లా అమెరికాను అధిగమించేస్తామని హైదరాబాద్లోని ప్రముఖ విద్యాసంస్థ బిట్స్ పిలానీ అంచనా వేసింది. అక్టోబర్ నాటికి దేశంలో కేసుల సంఖ్య 70 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని అధ్యయనానికి నేతృత్వం వహించిన అప్లయిడ్ మ్యాథమెటిక్స్ విభాగానికి చెందిన పరిశోధకురాలు డాక్టర్ టీఎస్ఎల్ రాధిక తెలిపారు.
అడ్వాన్స్డ్ స్టాటిస్టికల్ లెర్నింగ్ టెక్నిక్స్ విధానాన్ని ఉపయోగించి దేశంలోని కరోనా కేసులను అంచనా వేసినట్టు చెప్పారు. ఈ పరిశోధన ఫలితాలను ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్కు పంపినట్టు వివరించారు. దీర్ఘకాలంలో కేసుల సంఖ్యను అంచనా వేసేందుకు మరింత మెరుగైన విధానాన్ని రూపొందిచనున్నట్టు డాక్టర్ రాధిక చెప్పారు.
మరోవైపు, మే నెల వరకే దేశంలో 64 లక్షల మందికి కరోనా సోకి ఉంటుందని ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రెసెర్చ్) అంచనా వేసింది. దేవ్యాప్తంగా నిర్వహించిన సీరో సర్వే ఫలితాలను ఐసీఎంఆర్ రిలీజ్ చేసింది. మే నెల ఆరంభంలో దేశవ్యాప్తంగా సుమారు 64,68,388 మంది పెద్దలకు వైరస్ ఇన్ఫెక్షన్ సోకి ఉంటుందని సీరో సర్వే నివేదిక వెల్లడించింది.
కాగా, దేశంలో కరోనా కేసులు, మృతుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతోంది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. భారత్లో కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 96, 551 కేసులు బయటపడ్డాయి. ఇప్పటి వరకూ ఒకే రోజులో అత్యధిక కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 45,62,415 కు చేరుకుంది. మొత్తం మరణాల సంఖ్య 76,271 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 35,42,664 గా ఉంది.