ఏప్రిల్ 15 తర్వాత తెరుచుకోనున్న ఆఫీసులు
ఏప్రిల్ 15 వతేదీ నుంచి మేఘాలయలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ పూర్తికాగానే ప్రభుత్వ కార్యాలయాల సేవలు అందుబాటులోకి వస్తాయని ఈశాన్య రాష్ట్రం తెలిపింది.
ప్రయివేటు వాహానాల రాకపోకలకు అనుమతిస్తామని, విద్యా సంస్ధలు మాత్రం నెలాఖరు వరకు మూసి వేస్తామని ప్రకటించింది. కాగా…..మేఘాలయలో ఇంతవరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 15 నుంచి పాక్షికంగా లాక్డౌన్ను ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ మేరకు కేబినెట్ సమావేశం అనంతరం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. ‘‘ఏప్రిల్ 15 నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిస్థాయిలో పనిచేస్తాయి. విద్యాసంస్థలను మాత్రం ఏప్రిల్ 30 వరకు మూసివేస్తున్నాం. రైతులు పొలాలకు వెళ్లొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్లు వారానికి ఒకసారి తెరుస్తాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కొనసాగుతుంది. అయితే వ్యాపారాలపై మాత్రం లాక్డౌన్ ప్రభావం కొనసాగుతుంది.
కోవిడ్-19 వ్యాప్తిస్తున్న తరుణంలో రోజూ కూలీలు, వేతన జీవులు, చిరు వ్యాపారులను ఆదుకునేందుకు వారానికి 700 రూపాయల చొప్పున ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సహాయం అందజేస్తాం. లబ్దిదారుల ఖాతాలోకి నేరుగా నగదు బదిలీ చేస్తాం’’ అని ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు.
మరో వైపు నిజాముద్దీన్ మర్కజ్ మసీదు ప్రార్ధనల్లో పాల్గోన్న ముస్లింలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించటంతో ఆయా రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దీంతో ఆయా రాష్ట్రాలు లాక్ డౌన్ ను మరి కొన్ని రోజలు పొడిగించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
ముఖ్యంగా ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల తర్వాత తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరావు.. దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ఎత్తివేసినా తమ రాష్ట్రంలో మాత్రం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో కరోనా బాధితులు ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, రాజస్తాన్, కేరళ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ కూడా మరికొన్ని వారాల పాటు లాక్డౌన్ కొనసాగిస్తేనే వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం సాధ్యమవుతుందని భావిస్తున్నట్లు సమాచారం.
See Also | Covid-19 పేరుతో ముస్లింలను చంపేస్తున్నారంటోన్న ఎమ్మెల్యే అరెస్టు