నువ్వు నన్నేమీ చేయలేవు…న్యాయమూర్తికి పోలీసు సిబ్బంది బెదిరింపు

  • Published By: bheemraj ,Published On : July 1, 2020 / 09:38 PM IST
నువ్వు నన్నేమీ చేయలేవు…న్యాయమూర్తికి పోలీసు సిబ్బంది బెదిరింపు

తమిళనాడులో తండ్రీ, కుమారుల పోలీసు కస్టడీ మృతి ఘటనపై విచారణ చేసేందుకు వెళ్లిన న్యాయమూర్తి అనూహ్య పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. తూత్తుకుడిలో మొబైల్ షాపు యజమానులైన పి.జయరాజ్ (59),
కుమారుడు బెన్నిక్స్ (31)లు పోలీసు కస్టడీలో మృతి చెందిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ విషయంపై విచారణ చేసేందుకు వెళ్లిన కోవిల్ పట్టి న్యాయమూర్తి ఎంఎస్ భారతీదాసన్ తోనే పోలీసు సిబ్బంది బెదిరింపు ధోరణిని అవలంభించిన సంగతి తెలిసింది. ఈ మేరకు ఆయన మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ కు నాలుగు పేజీల నివేదికను సమర్పించారు.

ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం…తూత్తుకుడి జిల్లాలోని సతన్ కుళం పోలీస్ స్టేషన్ లో జయరాజ్, బెన్నిక్స్ లపై జూన్ 19 న విచారణ జరిగింది. అనంతరం వారు తీవ్ర గాయాల వల్ల జూన్ 22న మరణించారు. కాగా, వీరు పోలీసుల దౌర్జన్యం వల్లనే చనిపోయారా అనే విషయాన్ని విచారించేందుకు వెళ్లిన న్యాయమూర్తినే పోలీసు సిబ్బంది బెదిరింపులకు గురిచేశారు. ఒకే ఒక ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మహిళా పోలీసు.. ఇతర సిబ్బందితో సమస్యలు ఎదురుకాగలవనే భయంతో వణికిపోయారు. అయితే ఆమె కుదుట పడేందుకు కొంత సమయం ఇచ్చిన అనంతరం విచారణ కొనసాగించారు.

ఆమె లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాచారం ప్రకారం జయరాజ్, బెన్నిక్స్ లను ఆ రాత్రంతా కొడుతూనే ఉన్నారని తెలిపింది. అంతేకాకుండా లాఠీలు, టేబుల్ పై రక్తపు మరకలు ఉన్నట్టు కూడా ఆమె తెలిపారు. స్టేషన్ లో ఉన్న సీసీ టీవీ కెమేరా ఆటో-డిలీట్ మోడ్ లో ఉండటం వల్ల నాటి రాత్రికి సంబంధించిన ఫుటేజ్ కూడా లభించలేదని తెలిపింది. చివరికి మెజిస్ట్రేట్ ను కానిస్టేబుల్ మహరాన్ నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని బెదిరించినట్టు కూడా తెలిసింది.

జూన్ 28న పోలీస్ స్టేషన్ లో 15 గంటల పాటు విచారణ సాగింది. పోలీసులు తమ బలాన్ని ప్రదర్శించే విధంగా నా ముందే శారీరక భంగిమలు ప్రదర్శించారు. రికార్డులు, దస్తావేజులను అందించటంతో పోలీస్ స్టేషన్ సిబ్బంది కావాలని ఆలస్యానికి పాల్పడ్డారు. హార్డ్ డిస్క్ లో అత్యధికంగా ఒక టెరాబైట్ స్టోరేజ్ ఉన్నప్పటికీ, ఫుటేజ్ అంతా ఏరోజుకారోజు చెరిగిపోయే విధంగా అమర్చారు. ఘటనా సమయంలో విధుల్లో ఉన్న సిబ్బందిని లాఠీలు సమర్పించమని అడిగినప్పుడు వారు విననట్టే నటించారు. తొలుత తన లాఠీ స్వగ్రామంలో ఉందన్న కానిస్టేబుల్ మహరాన్… తర్వాత అది పోలీసు ప్రధాన కార్యాలయంలో ఉందన్నాడు. చివరకు తన వద్ద అసలు లాఠీయే లేదని చెప్పాడు. ఒక దశలో మేజిస్ట్రేటు వెనుక నిలుచున్న మహారాజన్, ఆయన తనను ఏమీ చేయలేరని నిందాత్మకంగా మాట్లాడాడు.

ఇక మరో ఉద్యోగి విచారణను తప్పించుకొనేందుకు స్టేషన్ నుంచి పరిగెత్తాడు. స్టేషన్ లో వాతావరణం అశాంతిగా, అధ్వాన్నంగా, భయంగొలిపేదిగా ఉంది. అంతేకాకుండా పోలీసు సిబ్బంది తొలి నుంచి అవిధేయతను, సహాయ నిరాకరణ ధోరణిని ప్రదర్శించారు అని మేజిస్ట్రేటు భారతీదాసన్ వాంగ్మూలం నమోదు చేశారు. ఈ మేరకు ఆయన తన నివేదికను రిజిస్ట్రార్ కు జూన్ 29న ఈ మెయిల్ ద్వారా పంపారు.

విచారణకు హాజరైన మహిళా పోలీసుకు రక్షణ కల్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా మరణాల ఘటనతో సంబంధమున్న సిబ్బందిపై హత్యానేరం క్రింద విచారణ జరుగుతుందని వివరించింది. కాగా, ఈ ఘటన తమిళనాడు పోలీసు శాఖలో కలకలం రేపింది. కస్టడీ మరణాలు జరిగిన మరుసటి రోజే ఆ శాఖలో 39 బదిలీలు చోటుచేసుకున్నాయి. డీఎస్పీ సీ ప్రతాపన్, ఏడీఎస్పీ డీ కుమార్, కానిస్టేబుల్ మహరాజన్ లు మేజిస్ట్రేటు దర్యాప్తుకు ఆటంకం కలిగించిన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.

సంబంధిత కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు వేయగా.. ఇరువురు ఉన్నతాదికారులను వెయిటింగ్ లో ఉంచారు. కాగా, ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలను గత వారం లోనే సస్పెండ్ చేశారు. అయితే కోర్టు నిరవధిక వెయిటింగ్ లో ఉంచారు. ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలను గతవారంలోనే సస్పెండ్ చేశారు. అయితే కోర్టు నిరవధిక వెయిటింగ్లో ఉంచాలని ఆదేశించినప్పటికీ… ప్రతాపన్ యాంటీ లాండ్ గ్రాబింగ్ స్పెషల్ సెల్ లో… కుమార్ ను ప్రొహిబిషన్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగంలోనూ నియమించటం గమనార్హం.