Wrestlers Protest: ప్రభుత్వం ఎవరినీ రక్షించడం లేదు.. రెజ్లర్ల సమస్యపై క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్ను అరెస్టు చేయాలంటూ రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు క్రమంగా మద్దతు పెరుగుతోంది.
Sports Minister Anurag Thakur: డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్ (WFI Chief Brij Bhushan Saran Singh), ను అరెస్టు చేయాలంటూ రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు క్రమంగా మద్దతు పెరుగుతోంది. బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Government) ముందుకు రాకపోవటంతో రెజ్లర్లు (Wrestlers) తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తున్నారు. ఈ క్రమంలో గత నెల28న రెజ్లర్లు తమ పతకాలను హరిద్వార్ వద్ద గంగా నదిలో వదిలేందుకు సిద్ధమయ్యారు. చివరి నిమిషంలో రైతు నేతల విజ్ఞప్తితో రెజ్లర్లు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. అయితే, ప్రభుత్వానికి ఐదు రోజులు గడువు ఇచ్చారు. అయినా స్పందించకుంటే జూన్ 5న ఢిల్లీ సరిహద్దుల్లో ఘెరావ్ చేస్తామని బీకేయూ (భారతీయ కిసాన్ యూనియన్) హెచ్చరించిన విషయం విధితమే.
జూన్ 5న (సోమవారం) నుంచి ఢిల్లీ సరిహద్దులను ముట్టడిస్తామని ఆదివారం బీకేయూ పేర్కొంది. తాజా పరిస్థితులపై క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ (Sports Minister Anurag Thakur) ను మీడియా ప్రశ్నించగా.. ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నిరసన చేస్తున్న రెజ్లర్లకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని అన్నారు. క్రీడలు, క్రీడాకారులను ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తుందని చెప్పారు. బ్రిజ్ భూషణ్ సింగ్ అరెస్టు గురించి కేంద్ర మంత్రి స్పందించారు. మేము (కేంద్ర ప్రభుత్వం) ఎవరినీ రక్షించడం లేదు.. ఎవరినీ రక్షించాలని అనుకోవటం లేదు అని చెప్పారు. ఈ విషయంలో న్యాయమైన దర్యాప్తును భారత ప్రభుత్వం కోరుకుంటుంది. దాని నుండి మేము ఎప్పటికీ వెనక్కి తగ్గము అని కేంద్ర మంత్రి అనురాగ్ తెలిపారు.
రెజ్లర్లతో వరుసగా రెండు రోజులు సమావేశం కొనసాగిందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. ఏడేళ్ల ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని ఆటగాళ్లు చెప్పారని, ఆ తరువాత వారితో అన్ని విషయాలు మాట్లాడిన తరువాతే కమిటీని ఏర్పాటు చేశామని రాకూర్ చెప్పారు. దీనిపై కమిటీ నిష్పక్షపాతంగా విచారణ చేపట్టిందని అన్నారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు ఏప్రిల్ 23 నుంచి న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్నారు. అయితే, ఇటీవల జంతర్ మంతర్ వద్ద నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు.