Lakhimpur Violence : లఖింపూర్ ఘటనపై బుధవారం సుప్రీం విచారణ
దేశవ్యాప్తంగా కలకలం రేపిన అక్టోబర్-3,2021నాటి లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్
Lakhimpur Violence దేశవ్యాప్తంగా కలకలం రేపిన అక్టోబర్-3,2021నాటి లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనపై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లీతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. కాగా,లఖింపూర్ ఘటనకు సంబంధించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఈ నెల 8న సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
అక్టోబర్ 3న లఖింపూర్ ఖేరిలో జిల్లాలో యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య,కేంద్రహోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా పర్యటన నేపథ్యంలో హింస చెలరేగిన విషయం తెలిసిందే. టికునియా-బన్బీర్పుర్ సరిహద్దు వద్ద సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులపైకి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా కారు, మరో వాహనం దూసుకెళ్లాయి.
ఈ ఘటనలో నలుగురు రైతులు అక్కడికక్కడే మరణించగా.. అనంతరం జరిగిన హింసలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్, ముగ్గురు బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా సహా పది మందిని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)అరెస్టు చేసింది.
లఖింపూర్ ఘటనపై సీబీఐతో కూడిన ఉన్నత స్థాయి న్యాయ విచారణను కోరుతూ ఇద్దరు న్యాయవాదులు సీజేఐకి లేఖ రాసిన తర్వాత సుప్రీం కోర్టు ఈ కేసును విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 8న కేసు విచారణ సమయంలో సుప్రీం కోర్టు ఘటనకు బాధ్యులైన నిందితులను అరెస్టు చేయకపోవడంతో యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. హత్యపై దర్యాప్తులో విశ్వాసం కలిగించేందుకు ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
ALSO READ Karnataka BJP Chief : రాహుల్ గాంధీ డ్రగ్స్ బానిస