corona vaccination : భారత్లో మూడోదశ కరోనా వ్యాక్సినేషన్.. 45 ఏళ్లు నిండిన వారందరికీ టీకా
దేశంలో కరోనా సెకండ్వేవ్ విజృంభిస్తోన్న సమయంలో భారత్ తీసుకున్న మరో పెద్ద నిర్ణయం అమల్లోకి వచ్చింది. వ్యాక్సినేషన్ను కేంద్రం మరింత విస్తృతం చేసింది.
Third stage corona vaccination in India : దేశంలో కరోనా సెకండ్వేవ్ విజృంభిస్తోన్న సమయంలో భారత్ తీసుకున్న మరో పెద్ద నిర్ణయం అమల్లోకి వచ్చింది. వ్యాక్సినేషన్ను కేంద్రం మరింత విస్తృతం చేసింది. మూడో దశలో భాగంగా 45 ఏళ్లు నిండిన వారందరికీ ఈ రోజు నుంచి టీకాలు ఇస్తున్నారు. జనవరి 16న దేశంలో వ్యాక్సినేషన్ స్టార్ట్ అవ్వగా.. మొదటి విడతలో హెల్త్కేర్ వర్కర్లు, ఫ్రంట్లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ఇచ్చారు. రెండో దశలో 60 ఏళ్లు పైబడిన వారితో పాటు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడినవారికి టీకా ఇచ్చారు. ఇక ఇవాళ్టి నుంచి ప్రారంభమైన మూడో దశలో 45 సంవత్సరాలు పైబడిన వారందరికీ టీకా ఇస్తున్నారు..
వ్యాక్సినేషన్ కోసం సమీప వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి గానీ, లేదా అంతకంటే ముందుగానే కొవిన్ పోర్టల్లో గానీ రిజస్టర్ చేసుకోవచ్చు. ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంది. వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్తే గనుక ఆధార్, ఓటర్, పాన్ తదితర వ్యక్తిగత గుర్తింపు కార్డులతో వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అన్ని ప్రభుత్వ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ ఆరోగ్య కేంద్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక కోవిన్ పోర్టల్లో తప్పుడు, డూప్లికేట్ ఎంట్రీలను నివారించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్ల సేవలను సమర్థంగా ఉపయోగించుకోవాలని కోరింది. వ్యాక్సిన్ స్టాక్ పాయింట్లలో టీకా డోసులు చెడిపోకుండా చర్యలు తీసుకోవాలని తెలిపింది.
మూడో దశలో భాగంగా దేశవ్యాప్తంగా రోజుకు 50లక్షల మందికి టీకా ఇవ్వాలని టార్గెట్గా పెట్టుకుంది కేంద్రం. ప్రస్తుతానికి రోజుకు 20 లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తున్నారు. దేశంలో వ్యాక్సినేషన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా 6 కోట్ల 30 లక్షల మందికిపైగా టీకా వేశారు. ఇవాళ నుంచి రోజుకు 50 లక్షల మందికి టీకాలు ఇస్తే మరో 2 వారాల్లోనే 45 ఏళ్లు దాటిన వారికి టీకా ఇవ్వడం పూర్తవుతుంది. అయితే ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ చాలా నిదానంగా సాగుతోంది.
రెండో డోస్ కోసం వ్యాక్సిన్ స్టాక్ను పక్కన పెట్టకుండా… 45 ఏళ్లు పై బడిన వారందరికీ టీకాలు ఇవ్వాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. వ్యాక్సిన్ల నిరుపయోగం ఒక శాతం కంటే తక్కువ ఉండేలా చూడాలని తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆరు శాతం టీకాలు వృథా అవుతున్నాయి. దీనిపై సంబంధిత రాష్ట్రాలు ఫోకస్ చేస్తున్నాయి. వ్యాక్సిన్ వేస్ట్ అవ్వకుండా.. వ్యాక్సినేషన్పై ప్రజల్లో అవగాహన వచ్చేలా ఇప్పటికే రాష్ట్రాలు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. అన్ని అనుకున్నట్టు జరిగితే మరో 14 రోజుల్లోనే మూడో దశ వ్యాక్సినేషన్ విజయవంతంగా పూర్తవుతుంది.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో మూడో దశ వ్యాక్సినేషన్కు ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. తెలంగాణలో 45 ఏళ్ల వయసు పైబడినవారు 80 లక్షల మంది ఉంటారని ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటికే హెల్త్కేర్, ఫ్రంట్లైన్ వర్కర్లకు తొలి విడత టీకా పూర్తైనట్లు డీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. ఇక ఇవాళ్టి నుంచి 45 ఏళ్లు దాటిన వారందరిలో రోజుకు లక్ష మందికి టీకా ఇచ్చే విధంగా ప్లాన్ రెడీ చేసింది. వెయ్యి ప్రభుత్వ, 250 ప్రైవేట్ కేంద్రాల్లో వ్యాక్సినేషన్కు ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో రోజుకు లక్ష మందికి టీకా వేస్తే 10 రోజుల్లోపే ప్రభుత్వం తమ టార్గెట్ను రీచ్ అవుతుంది.