దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితం : కేంద్ర మంత్రి హర్షవర్ధన్
corona vaccine will be provided free of cost to people : దేశ ప్రజలందరికీ కరోనా టీకా ఉచితంగా అందిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. కరోనా వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ భద్రతపై వదంతలు నమ్మొద్దన్నారు. పోలియో టీకా ఇస్తున్న సమయంలోనూ ఇలాంటి వదంతులే పుట్టుకొచ్చాయని…వాటిని పక్కన పెట్టడం వల్లే భారత్ నేడు పోలియో రహిత దేశంగా మారిందన్నారు.
వ్యాక్సిన్ భద్రత, సమర్థత, రోగ నిరోధక శక్తి పెంపుదలపై రాజీపడేది లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో వ్యాక్సిన్ డ్రై రన్ జరుతున్న తీరును హర్షవర్ధన్ స్వయంగా పరిశీలించారు. ఢిల్లీలోనే కాదు దేశమంతా వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని చెప్పారు. కోవిడ్ షీల్డ్ వినియోగానికి కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ నిపుణుల కమిటీ సిఫారుసు చేసిందని తెలిపారు.
మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ కొనసాగుతోంది. వ్యాక్సిన్ పంపిణీలో ఎదురయ్యే సమస్యలను గుర్తించడమే లక్ష్యంగా ఈ డ్రై రన్ సాగుతోంది. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం డ్రై రన్ నిర్వహించింది. ఇప్పుడు మిగిలిన.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో డ్రై రన్ జరగుతోంది.
కొత్త సంవత్సరంలో ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వడమే లక్ష్యంగా మోడీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ముందస్తుగా దేశ వ్యాప్త డ్రై రన్ నిర్వహిస్తోంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో డమ్మీ వ్యాక్సినేషన్ స్టార్ట్ అయింది. రాష్ట్రాల రాజధానులు, వివిధ జిల్లాల్లో కనీసం మూడు ప్రాంతాల్లో వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహిస్తున్నారు అధికారులు. కష్టతరమైన కొండ ప్రాంతాలున్న భూభాగంతో పాటు.. తక్కువ రవాణా సౌకర్యమున్న జిల్లాల్లోనూ డ్రై రన్ జరగుతోంది.
వ్యాక్సిన్ పంపిణీలో ఎదురయ్యే సమస్యలను గుర్తించడమే లక్ష్యంగా డ్రై రన్ సాగుతోంది. కొన్ని రకాల వ్యాక్సిన్లకు అతిశీతల వాతావరణంలో భద్రపర్చడమే పెద్ద సవాల్. ఈ క్రమంలో కోల్డ్ స్టోరేజీ వ్యవస్థ, పంపిణీలో తలెత్తే సమస్యలు, వ్యాక్సినేషన్ అనంతరం ఎదురయ్యే సమస్యలపై అధికారులు ఫోకస్ చేస్తున్నారు. డ్రై రన్ సందర్భంగా ఎదురైన సమస్యలను సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రానికి నివేదిస్తాయి.