ముఖేష్ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాల కలకలం
Vehicle భారతదేశపు నెం.1 ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాల కలకలం సృష్టించాయి. గురువారం ముంబైలోని ముఖేష్ ఇంటికి దగ్గర్లో పేలుడు పదార్థాలు ఉన్న ఓ స్కార్పియో కారును గుర్తించారు పోలీసులు. ఈ వాహనాన్ని తొలుత ఆయన భద్రతా సిబ్బంది గుర్తించారు.
ముఖేష్ నివాసం వద్దకు చేరుకున్న బాంబ్ స్క్వాడ్ బృందాలు..పేలుడు పదార్థాలను జిలెటిన్ స్టిక్స్గా గుర్తించాయి. అంబానీ హత్య కుట్రకు ఈ కారును అక్కడ ఉంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముంబై క్రైం బ్రాంచ్ దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ తెలిపారు.
ముఖేష్ నివాసం ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలన్నీంటిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు కారును సీజ్ చేశారని తదుపరి విచారణ కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు. జాయింట్ కమిషనర్ విశ్వాస్ నాగ్రే పాటిల్ కూడా సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులతో మాట్లాడారు. ముంబై పోలీసుల ఫోరెన్సిక్ బృందం సంఘటన స్థలానికి చేరుకొని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. అనుమానస్పద కారు లభ్యమవడంతో.. పోలీసులు ఈ ప్రాంతంలో భద్రతను పెంచారు.