ఐటీ ఉద్యోగులకు డిసెంబర్‌ 31 వరకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

  • Published By: bheemraj ,Published On : July 23, 2020 / 01:57 AM IST
ఐటీ ఉద్యోగులకు డిసెంబర్‌ 31 వరకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా వైరస్‌ వల్ల పలు కంపెనీలు ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. చాలా వరకు ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేయడానికి వెసులుబాటు కల్పించాయి.

తాజాగా కేంద్ర ప్రభుత్వం మరోసారి ఐటీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఐటీ, బీపీవో కంపెనీలకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని డిసెంబర్‌ 31 వరకు పొడిగించింది. భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో మరికొన్ని నెలల పాటు ‘వర్క్ ఫ్రం హోం’ సౌకర్యాన్ని కేంద్రం పొడిగించింది.

గతంలో విధించిన గడువు జూలై 31తో ముగుస్తున్నది. కోవిడ్‌-19 కారణంగా ప్రజల్లో నెలకొన్న భయాందోళనను దృష్టిలో ఉంచుకొని ఇంటి నుంచి పనిచేసే విధానాన్ని 2020 డిసెంబర్‌ 31 వరకు పొడిగిస్తూ సర్వీసు ప్రొవైడర్లకు నిబంధనలు, షరతులలో డాట్‌ సడలింపులు ఇచ్చిందని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ ట్వీట్‌ చేసింది.

భారత్‌లో ప్రస్తుతం 85శాతం మంది ఐటీ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే అవకాశం కల్పించారు. చాలా కొద్ది మంది మాత్రమే ఆఫీసులకు వెళ్తున్నారు.