Tirumala Heavy Pilgrim Rush : తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం
తిరుమల భక్తులతో కిటకిలాడుతోంది. వరుస సెలవు దినాలు కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలో నిల్చున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో స్వామి వారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది.
Tirumala Heavy Pilgrim Rush : తిరుమల భక్తులతో కిటకిలాడుతోంది. వరుస సెలవు దినాలు కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలో నిల్చున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో స్వామి వారి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది.
రాఖీ పౌర్ణమి సెలవుకి తోడు శని, ఆదివారం, స్వాతంత్ర్య దినోత్సవం.. ఇలా వరుస సెలవులు రావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. వైకుంఠం కాంప్లెక్స్ లోని కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోవడంతో మిగతా భక్తులంతా క్యూలోనే నిల్చున్నారు. గంటల తరబడి నిల్చోలేక కొందరు ఇబ్బంది పడ్డారు. లైన్ ముందుకు కదలడానికి చాలా సమయమే పడుతోంది. చిన్నపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు.
కాగా.. తిరుమలకు వచ్చే భక్తులందరికీ వసతి ఏర్పాటు చేయడం కష్టమని టీటీడీ అధికారులు చెప్పారు. భక్తులు తిరుపతిలోనే వసతి పొంది, తమకు కేటాయించిన స్లాట్ ప్రకారం దర్శనానికి రావాలన్నారు. కొత్తగా గదుల నిర్మాణం చేపట్టకూడదని ప్రభుత్వం, హైకోర్టు ఆర్డర్ ఉన్నట్లు తెలిపారు. గదుల కొరత కారణంగా తిరుమలలో వసతి కొరకు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందన్నారు.
ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 27 నుండి జరుగనున్నాయి. భక్తులకు సంతృప్తికరంగా మూలమూర్తి దర్శనంతోపాటు వాహనసేవలు వీక్షించే అవకాశం కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేపడుతున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇందులో ప్రధానంగా సెప్టెంబర్ 27న ధ్వజారోహణం, అక్టోబర్ 1న గరుడ సేవ, అక్టోబర్ 2న స్వర్ణరథం, అక్టోబర్ 4న రథోత్సవం, అక్టోబర్ 5న చక్రస్నానం నిర్వహిస్తారు.
కరోనా కారణంగా రెండేళ్ల తరువాత మాడ వీధుల్లో శ్రీవారి బ్రహ్మోత్సవ వాహనసేవలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శనం మాత్రమే ఉంటుంది. రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం, వృద్ధులు, వికలాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు ఇచ్చే అన్నిరకాల ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు చేశారు. బ్రహ్మోత్సవాల్లో తొలి రోజైన సెప్టెంబర్ 27న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.