విద్యుద్దీప కాంతులతో యాదాద్రి గోపురాలు
యాదాద్రి: తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయం దేశంలోనే మరెక్కడా లేని విధంగా ప్రత్యేకతలను సంతరించుకుంటోంది. ప్రపంచస్ధాయి ఆధ్యాత్మిక కేంద్రంగా రూపు దిద్దుకుంటున్న క్రమంలో ఆలయ పునర్నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ఆధార శిలనుంచి శిఖరం వరకు కృష్ణరాతి శిలలతో, దేశంలోనే అత్యద్భుత కట్టడంగా రూపోందుతున్న అష్టభుజి ప్రాకార మండపాలు, కాకతీయ, యాలీ పిల్లర్లతో పాటు సప్తగోపుర సముదాయం భక్తులను అలరించనున్నాయి.
అద్భుతమైన కళాఖండాలతో నిర్మితమవుతున్న ఆలయ గోపురాలు, ప్రాకారాలు, పగలే కాక… రాత్రివేళల్లోనూ భక్తులను మిరుమిట్లు గొలిపే దీప కాంతులతో మైమరిపించనున్నాయి. ఇందుకోసం ఆలయ ప్రాకార మండపాలకు, గోపురాల సముదాయానికి విద్యుద్దీపాలను అమర్చారు. బెంగళూరుకు చెందిన ఎలక్ట్రికల్ టెక్నాలజీ సంస్థ వీటిని అమర్చింది. శనివారం యాదాద్రి కొండపై ఉత్తర వైపున గల పంచతల రాజగోపురం, అష్టభుజి ప్రాకారాలకు విద్యుద్దీపాలను అమర్చారు. విద్యుద్దీప కాంతులతో వెలిగిపోతున్న గోపురాలను వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు, ఆలయ ఆర్కిటెక్ట్ ఆనందసాయి, ప్రధాన స్తపతి డాక్టర్ ఆనందచారి వేలు, ఆలయ ఈవో ఎన్.గీతారెడ్డి పరిశీలించారు.